Begin typing your search above and press return to search.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు: కృష్ణం రాజు

By:  Tupaki Desk   |   28 Jun 2022 2:30 PM GMT
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు: కృష్ణం రాజు
X
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రభాస్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో 'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్.. తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది.

2002 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ ని హీరోగా లాంచ్ చేస్తూ 'ఈశ్వర్' సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్ పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి ఆశీర్వదించారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ అనేది ఎవరికైనా మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది. కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటడం అన్నది వారి సొంత టాలెంట్ పైనే ఉంటుంది. అలా ప్రభాస్ భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్నాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారబోతున్నాడు. ఎందుకంటే 'ఆదిపురుష్' 'ప్రాజెక్ట్ K' వంటి పాన్ ఇండియా చిత్రాలను అటు హాలీవుడ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికి 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా డార్లింగ్ అభిమానులు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరియు ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జెఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాద్ లోని కృష్ణంరాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ మరియు నిర్మాత అశోక్ కుమార్ లతో పాటుగా కృష్ణంరాజు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్బంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ ని మా గోపి కృష్ణ బ్యానర్ లోనే హీరోగా పరిచయం చేద్దామని ముందు అనుకున్నాం. ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్ - దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. 'ఈశ్వర్' కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం'' అని అన్నారు.

''జయంత్ - అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల.. ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను'' అని కృష్ణంరాజు అన్నారు.

'ఈశ్వర్' చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. ''నిజంగా నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. ప్రభాస్ నిజంగా గొప్ప వ్యక్తి. ఈ మధ్య కూడా తనను కలిసాను. ఈశ్వర్ సమయంలో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అంత పెద్ద హీరో అన్న గర్వం ఏ కోశానా లేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి'' అని అన్నారు.

''ఈశ్వర్ సమయంలో ప్రభాస్ తో ఉన్న రోజులు కూడా మరచిపోలేను. ఈ సినిమా సమయంలో కథ అనుకున్న తరువాత చాలా మంది హీరోలను పరిశీలించాను. అయితే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు.. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణం రాజును కలవడం.. మేమే పరిచయం చేస్తామని కాకుండా మమ్మల్ని నమ్మి హీరోని ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మాకు సపోర్ట్ అందించిన కృష్ణం రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అని జయంత్ చెప్పుకొచ్చారు.

నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ''నిజానికి 'ఈశ్వర్' సినిమా కథ అనుకున్నాక మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ అపుడు మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు.. అప్పుడే సినిమాల్లోకి లాగడం కరెక్ట్ కాదేమో అనిపించి మరో హీరో కోసం చూసాం. చాలా మందిని పరిశీలించాక ప్రభాస్ నచ్చడంతో వెంటనే కృష్ణం రాజు గారిని కలవడం.. ఆయన కూడా ఓకే అనడంతో 'ఈశ్వర్' తెరకెక్కింది'' అని చెప్పారు.

''నిజంగా ప్రభాస్ అప్పటికి ఇప్పటికి అతని యాటిట్యూడ్ లో ఎలాంటి మార్పు లేదు. ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా కూడా అందరితో కలివిడిగా ఉంటారు. 'ఈశ్వర్' సినిమా అప్పుడే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుందా అని అనిపించింది. మొన్నే తీసినట్టుగా ఉంది. సినిమా సినిమాతో ఎదిగిన మా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను'' అశోక్ కుమార్ అన్నారు.

కృష్ణం రాజు భార్య శ్యామల మాట్లాడుతూ.. ''ప్రభాస్ ని హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిసి రామానాయుడు స్టూడియో నుండి హైదరాబాద్ రోడ్లన్నీ నిండిపోయాయి. మేము స్టూడియోకి రావాలని కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని వెనక్కి వెళ్లిపోయాం. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగడం చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని. హీరోగా అంత పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చినా కూడా అందరితో చాలా చక్కగా ఉంటాడు. నిజంగా ప్రభాస్ ని చూస్తుంటే పెద్దమ్మగా చాలా గర్వంగా ఉంది. ఇలాగే మరిన్ని విజయాలు అందుకుంటూ ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.