Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూనమ్ కౌర్ హల్‌ చల్

By:  Tupaki Desk   |   28 May 2020 4:07 PM GMT
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూనమ్ కౌర్ హల్‌ చల్
X
పూనమ్ కౌర్ అనే అమ్మాయి తెలుగులో చేసిన సినిమాల స్థాయికి.. ఆమెకు మీడియాలో దక్కే కవరేజీకి అసలు పొంతనే ఉండదు. టాలీవుడ్ లో కెరీర్ ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ.. ఆమె హైదరాబాద్‌ ను వీడట్లేదు. ఇక్కడి మీడియా దృష్టి నుంచి పక్కకు వెళ్లట్లేదు. ఆమె ట్విట్టర్ లో ఎప్పుడు ఏం బాంబు పేలుస్తుందో అని ఫాలోవర్లు ఎదురు చూస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద - త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా ఆమె గతంలో చేసిన కామెంట్లు కొన్ని సంచలనం రేపాయి. తాజాగా పూనమ్ ఎవ్వరూ ఊహించని పని చేసింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌ లోని ఆయన సమాధిని సందర్శించింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లోనే చాలామంది ఎన్టీఆర్ ఘాట్‌ ను సందర్శించలేదు.

ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు ఎక్కడున్నా ఘాట్‌ కు వచ్చి సీనియర్‌ కు నివాళులు అర్పిస్తారు. అలాంటిది వాళ్లే కరోనా నేపథ్యంలో ఈసారి సందర్శనను విరమించుకున్నారు. ఇలాంటి తరుణంలో పూనమ్ కౌర్ ఎన్టీఆర్ ఘాట్‌ కు వచ్చి హల్‌ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఎన్టీఆర్‌ ను తెలుగు ప్రజల దేవుడిగా అభివర్ణించిన పూనమ్.. చెడుతో పోరాటం చేసేలా తనను స్వర్గం నుంచి దీవించాలంటూ ఆయన్ని కోరింది. ఎన్టీఆర్ లాంటి నాయకులు - ఆయన లాంటి నటులు ఇప్పుడు చాలా అవసరమని.. ఇప్పుడు మానవత్వం కొరవడిందని ఆమె పేర్కొంది. ఎప్పట్లాగే పూనమ్ మాటల్లో లోతైన అర్థాలేమైనా ఉన్నాయేమో అని నెటిజన్లు విశ్లేషించడం మొదలుపెట్టారు. ఉన్నట్లుండి పూనమ్ దృష్టి ఎన్టీఆర్ వైపు మళ్లిందేంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఆమె అటెన్షన్ కోసమే ఇలా చేస్తోందని ఇంకొందరంటున్నారు.