Begin typing your search above and press return to search.

మిడుత దాడి.. వైర‌స్.. ఇవ‌న్నీ సూర్య సినిమాల్లో!

By:  Tupaki Desk   |   29 May 2020 3:30 AM GMT
మిడుత దాడి.. వైర‌స్.. ఇవ‌న్నీ సూర్య సినిమాల్లో!
X
మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ‌ వేళ సౌత్ లో ఓ ఫ్లాప్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. సూర్య క‌థానాయ‌కుడిగా ఏ.ఆర్.మురుగ‌దాస్ తెర‌కెక్కించిన సెవెంత్ సెన్స్ (7ఏఎం ఆరివు) చిత్రంలో వైర‌స్ గురించి అంటు వ్యాధి గురించి చూపించారు.. ఇలా జ‌రుగుతుంద‌ని ఆరోజే మురుగ‌దాస్ చూపించారు!! అంటూ యూత్ అదే ప‌నిగా మాట్లాడుకున్నారు. అదొక్క‌టేనా? సూర్య న‌టించిన వేరొక సినిమాలోనూ అలాంటి ఒక యూనివ‌ర్శ‌ల్ కాజ్ ని చూపించడంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది.

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ఫ్లాప్ చిత్రం క‌ప్పాన్ (2019) మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో మిడుత‌ల దండు దాడికి సంబంధించిన స‌న్నివేశాలు అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చాయి. ఇప్పుడు భార‌త‌దేశంపైనా .. త‌మిళ‌నాడు.. తెలంగాణ‌.. ఆంధ్ర ప్ర‌దేశ్ పైనా మిడుత‌ల దాడి అన్న‌ది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. దేశంలో పంట‌ల్ని నిమిషాల్లోనే నాశ‌నం చేసే ఈ కీట‌కంపై భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఆ క్ర‌మంలోనే కాప్పాన్ లో ఆ స‌న్నివేశంపై మ‌రోసారి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. కాప్పాన్ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ యాథృచ్ఛికంగానే ఊహించారో ఏమో కానీ.. అది ఇప్పుడు నిజ‌మ‌వుతోంది. అస‌లింత‌కీ ఆ దృశ్యాల‌కు స్ఫూర్తినిచ్చిన అనుభ‌వం ఏది? అన్నది అడిగితే కె.వి ఆనంద్ చెప్పిన సంగ‌తులు ఆస‌క్తిక‌రం.

మిడుతల‌ దండయాత్రను దర్శకుడు కె.వి.ఆనంద్ ఎలా ఊహించారు? అనే దానిపై ఇప్పటికే ఇంటర్నెట్ లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మడగాస్కర్ లో ఒక చిత్రానికి లొకేషన్లను స్కౌట్ చేస్తున్నప్పుడు కేవీ పై మిడుతలు దాడి చేశాయిట‌. ఆ సంగ‌తిని ఆయనే స్వ‌యంగా వెల్ల‌డించారు. `` మాట్రాన్ (సూర్య‌) ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం తొమ్మిది సంవత్సరాల క్రితం మడగాస్కర్ ను సందర్శించాను. నేను లొకేషన్ స్కౌటింగ్ చేస్తున్నాను. నేను నా బృందంతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు.. వేలాది మిడుతలు మా దగ్గరికి రావడాన్ని నేను చూశాను. మాకు కార్ డ్రైవ్ చేయడం కష్టమైంది. అది క్లియర్ కావడానికి కొన్ని గంటల పాటు మ‌ర్గం మ‌ధ్య‌లోనే ఆగి పోవలసి వచ్చింది. ఆ సమయంలో వాటి గురించి అక్కడ ఉన్న ఒక స్థానిక వాసిని అడిగాను. చాలా వివరాలను సేకరించాను. తరువాత ఈ ఆలోచనను నా కప్పాన్ చిత్రంలో చేర్చాను`` అని తెలిపారు.

``మిడుత దాడులపై సినిమా తీసినందుకు నన్ను మెచ్చుకుంటూ చాలా కాల్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ నేను బాధపడుతున్నాను. ఈ విష‌యంలో నేను నిజంగా సంతోషంగా ఉండలేను. మిడుతల‌ దండయాత్ర వ‌ల్ల దేశానికి భారీ విధ్వంసం త‌ప్ప‌దు. వాటిని త‌క్ష‌ణం ఆపాలి. అందుకు త‌గు చర్యలు తీసుకోవాలి`` అని అన్నారు. ప్ర‌స్తుతం వైర‌స్ పై ఊహించిన మురుగ‌దాస్ పైనా.. అలాగే మిడుత‌ల దాడిపై ముందే ఊహించిన కె.వి.ఆనంద్ పైనా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.