Begin typing your search above and press return to search.

గవర్నర్ ను కలిసిన పాయల్..స్టార్ డైరెక్టర్ ను అరెస్ట్ చేస్తారా...?

By:  Tupaki Desk   |   29 Sep 2020 4:30 PM GMT
గవర్నర్ ను కలిసిన పాయల్..స్టార్ డైరెక్టర్ ను అరెస్ట్ చేస్తారా...?
X
బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ పై హీరోయిన్ పాయల్‌ ఘోష్‌ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనతో అనురాగ్‌ కశ్యప్‌ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్‌ ఘోష్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో వేడిక్కిపోయి ఉన్న బాలీవుడ్‌ లో పాయల్‌ వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాక ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో పాయల్ ఘోష్ గత వారం అనురాగ్‌ పై ఎఫ్ ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసుపై త్వరగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తానని పేర్కొంది.

దీంతో అనురాగ్‌ కశ్యప్‌ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం), 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్), 341 (తప్పుడు సంయమనం) మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దీంతో పాటు రసాయన పదార్థాలను వినియోగించినందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అనురాగ్ కశ్యప్‌ పై పాయల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో లైంగిక ఆరోపణలపై అనురాగ్‌ కశ్యప్‌ కు త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

ఇదిలా ఉండగా పాయల్ ఘోష్ తనకు ప్రాణహాని ఉందని ప్రధాని మోడీని సహాయం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌ దాస్ అథవాలే ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ట్వీట్‌ చేశారు. 'నటి పాయల్ ఘోష్ చేసిన వాదన ప్రకారం అనురాగ్ కశ్యప్‌ ను 7 రోజుల్లో అరెస్టు చేయాలని ముంబై పోలీసులను కోరుతున్నాను. లేదంటే రిపబ్లికన్ పార్టీ తరపున ఆందోళనలు జరపుతాం' అని రామ్‌ దాస్ అథవాలే పేర్కొన్నారు. ఈ క్రమంలో పాయల్ ఘోష్ నేడు (మంగళవారం) మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ని కలిశారు. అనురాగ్ కశ్యప్ లైంగింక వేధింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసారని తెలుస్తోంది. ఆమెతో పాటు కేంద్రమంతి రామ్ దాస్ అథవాలే కూడా గవర్నర్ ని కలిశారు.