Begin typing your search above and press return to search.

అకీరా గ్రాడ్యుయేషన్ డే: ఒకే ఫ్రేమ్ లో పవన్ - రేణూదేశాయ్..!

By:  Tupaki Desk   |   23 May 2022 4:16 PM GMT
అకీరా గ్రాడ్యుయేషన్ డే: ఒకే ఫ్రేమ్ లో పవన్ - రేణూదేశాయ్..!
X
పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ జంట ప్రేమ వివాహం చేసుకొని.. కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా ఇద్దరూ భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉన్నా.. పిల్లల కోసం అన్నీ పక్కన పెట్టేసి కలుస్తుంటారు.

పవన్ కళ్యాణ్ వీలు కుదిరినప్పుడల్లా రేణు ఇంటికి వెళ్లి పిల్లలు అకీరా నందన్ - ఆద్యలతో సమయం గడిపి వస్తుంటారనే విషయం తెలిసిందే. ఆ మధ్య రేణూ దేశాయ్ ఇంట్లో పవన్ తన పిల్లలతో ప్రేమగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూశాం.

ఇక రేణూ సైతం తన పిల్లలను మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచుతుంది. మెగా కుటుంబంలో జరిగే వేడుకలకు పండుగలప్పుడు అకీరా - ఆద్యలను పంపిస్తూ ఉంటుంది. అయితే పవన్ - రేణూ విడిపోయిన తరువాత ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సందర్భాలు లేవు.

సినిమా పోస్టర్స్ లో కనిపించారే తప్ప.. రియల్ గా కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడూ బయటకు రాలేదు. అయితే అలాంటి సందర్బమే ఇప్పుడు వచ్చింది. అకీరా నందన్ స్కూల్‌ గ్రాడ్యుయేషన్ డేలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది..

ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న అకీరా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ సోమవారం జరిగాయి. తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో అకీరా - ఆధ్యలతో పవన్ - రేణూ కలిసి ఉన్న ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ స్వయంగా ఈ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం విశేషం. బ్రిలియంట్ ఫోటోగ్రఫీ అంటూ వారిని ఒకే ఫ్రేమ్ లో బంధించిన వ్యక్తికి క్రెడిట్ ఇచ్చింది. ఇందులో పవన్ - రేణూ మధ్యలో తమ ముద్దుల కొడుకు కూతురు నిలబడి ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇకపోతే రేణూ ఈ ఫోటోని షేర్ చేస్తూ తల్లిదండ్రులుగా అకీరా ఉన్నతి పట్ల గర్వంగా ఉందని రాసుకొచ్చింది. ''ఒక శకం ముగుస్తుంది.. ఒక శకం ప్రారంభమవుతుంది. ఒక అమేజింగ్ బాయ్ గ్రాడ్యుయేషన్ డే నాడు అతని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ఇక ఉదయాన్నే స్కూల్ కు రెడీ కావాల్సిన అవసరం లేదు.. బస్ టైమింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు.. లంచ్ సమయానికి ప్యాక్ చేయడానికి తొందరపడాల్సిన పనిలేదు. ట్యూషన్‌లు లేవు.. పీటీఎం లేదు.. స్కూల్ లేదు'' అని రేణూ పేర్కొన్నారు.

''నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుందని నేను అకిరాతో చెప్పాను. అతను తన తల్లిదండ్రుల లైట్ అవసరం లేకుండా సూర్యకాంతిలో తనదైన స్థానాన్ని కనుగొంటాడని నేను ఆశిస్తున్నాను. నా లిటిల్ బేబీ చాలా వేగంగా పెరిగింది'' అని రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది. అయితే రేణూ ఈ ఫోటోకి కామెంట్ సెక్షన్ ని బ్లాక్ చేయడం గమనార్హం. అభిమానుల నుంచి అనవసరమైన కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఇలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, 'బద్రి' సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 'జానీ' సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. పవన్ నటించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. అయితే 2012 లో విడాకులు తీసుకొని వేర్వేరు మార్గాల్లో ప్రయనిస్తున్నారు.

విడాకులు తీసుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అన్నా లెజ్‌నోవా అనే రష్యన్ మహిళను మూడో వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ.. ఎందుకో ఆమె ఒంటరిగానే ఉంటున్నారు.ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు వచ్చి సినిమాల్లో నటిస్తున్నారు.