Begin typing your search above and press return to search.

ఎనిమిది సినిమాలు ఇప్పించిన ఒకే ఒక్క డైలాగ్!

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 AM GMT
ఎనిమిది సినిమాలు ఇప్పించిన ఒకే ఒక్క డైలాగ్!
X
తెలుగు తెరపై సాహసవంతమైన హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. హాలీవుడ్ యాక్షన్ కథలను .. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆయనే. అప్పట్లో కృష్ణ నుంచి అత్యధిక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. వాటిలో ఎక్కువగా భారీ విజయాలను అందుకునేవి. మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన ఇమేజ్ ఉండేది. అలాంటి కృష్ణ గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

"మాకు ఇండస్ట్రీలో ఒక కన్ను ఎన్టీఆర్ గారు అయితే మరో కన్ను కృష్ణగారు. మాకు పేరుపెట్టి పీట వేసింది అన్నగారైతే, ఆ పీట ముందు పళ్లెం పెట్టి భోజనం వడ్డించింది కృష్ణగారు. ఈ ఇద్దరినీ మేము జీవితంలో మరిచిపోలేము కృష్ణగారు ఎప్పుడూ కూడా ఎక్కువసేపు కథను వినేవారు కాదు. ఓ 15 నిమిషాల్లో కథ వినేసి బాగుందో .. లేదో చెప్పేసేవారు. 'ఖైదీ రుద్రయ్య' కథను ఆయన కేవలం రెండు నిమిషాల్లో వినేసి ఓకే చెప్పేశారు. ఆయన చేసిన 'బంగారుభూమి' సినిమాకి కూడా నేను పనిచేశాను. అందులోని ఒక డైలాగ్ నచ్చి కృష్ణగారు మాతో వరుసగా ఎనిమిది సినిమాలకు రాయించారు.

'బంగారు భూమి' సినిమా కోసం నేను రాసిన డైలాగ్ ను షూటింగులో చెబుతూ, 'ఎవరు ఈ డైలాగ్ రాసింది'? అని కృష్ణగారు అడిగితే అక్కడివారు ఆ పేరు చెప్పారట. "మనిషిని నమ్ముకుంటే మన నోట్లో ఇంత మట్టికొడతాడు. మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది .. ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టు .. "అనేది ఆ డైలాగ్. కృష్ణగారికి ఆ డైలాగ్ బాగా నచ్చేసింది. దాంతో ఆయన తాను చేయనున్న ఎనిమిది సినిమాలను మాకు ఇప్పించారు. ఆ తరువాత కూడా ఆయన మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలను అందించారు. ఆ మనిషి బంగారం .. ఆ మనసు బంగారం .. అంతే" అని చెప్పుకొచ్చారు.