Begin typing your search above and press return to search.

'పుష్ప-1' తరువాత వెంటనే పార్ట్-2 స్టార్ట్ చేయాల్సిందే..!

By:  Tupaki Desk   |   4 Dec 2021 4:30 AM GMT
పుష్ప-1 తరువాత వెంటనే పార్ట్-2 స్టార్ట్ చేయాల్సిందే..!
X
'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. అప్పటి ''పుష్ప'' చిత్రానికే అంకితమయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఒక సినిమాగానే చేయాలని అనుకున్నా.. కరోనా కారణంగా లేట్ అవడం.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యాన్ని రెండు భాగాలుగా చేసే స్పాన్ ఉండటంతో ప్లాన్స్ అన్నీ మారిపోయాయి.

రెండు పార్ట్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్న సుకుమార్.. పార్ట్-1 ని 'పుష్ప: ది రైజ్' పేరుతో రూపొందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా డిసెంబర్ 17న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దీని తర్వాత వెంటనే పార్ట్-2 చేయకుండా.. మధ్యలో అల్లు అర్జున్ - సుకుమార్ లు చెరొక సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు.

అల్లు అర్జున్ అప్పట్లోనే వేణు శ్రీరామ్ తో 'ఐకాన్' అనే మూవీ కమిట్ అయ్యారు. అలానే 'సరైనోడు' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రానికి అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు. ఇక కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి వెళ్లడంతో.. బన్నీ 'పుష్ప-1' తరువాత వేణు శ్రీరామ్ లేదా బోయపాటి లతో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు.

మరోవైపు అదే సమయంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ అనౌన్స్ చేసిన మల్టీలాంగ్వేజ్ మూవీ కంప్లీట్ చేసి వస్తారని భావించారు. అయితే ఇప్పుడు లెక్కల మాస్టారి లెక్కలన్నీ మారిపోయాయట. 'పుష్ప-1' తరువాత వెంటనే పార్ట్-2 చేయాల్సిందేనని సుక్కూ పట్టుబడుతున్నారట. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ చేసి ఉండటం.. స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉండటంతో కంటిన్యూ చేద్దామని చెబుతున్నారట.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ లైనప్ లో మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు. 'పుష్ప 2' చేసిన తర్వాతే మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందులో పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ చాలా కాలంగా గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ సెకండ్ పార్ట్ ని వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్తే.. స్టార్ హీరో మరో ఎనిమిది నెలలు సేమ్ గుబురు గెడ్డంలోనే ఉండాల్సి ఉంటుంది.

ఇకపోతే 'బాహుబలి' రెండు భాగాలను ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ మీదకు తీసుకెళ్లారు రాజమౌళి. 'కేజీయఫ్' క్లైమాక్స్ లోనే రెండో అధ్యాయంలో మిగతా కథ చెప్తానని ప్రకటించిన ప్రశాంత్ నీల్.. 'కేజీయఫ్ 2' ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో బన్నీ - సుక్కూ 'పుష్ప' పార్ట్-2 ని ముందుగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఇదే జరిగితే అప్పటి వరకు బోయపాటి శ్రీను లేదా వేణు శ్రీరామ్ వేచి చూస్తారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి త్వరలోనే అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.