Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు పార్ట్ 2ల ఫీవ‌ర్‌!

By:  Tupaki Desk   |   16 Aug 2022 5:30 PM GMT
టాలీవుడ్ కు పార్ట్ 2ల ఫీవ‌ర్‌!
X
స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఏ ముహూర్తాన పార్ట్ 1. పార్ట్ 2 సంస్కృతికి శ్రీ‌కారం చుట్టాడో కానీ ఇప్పుడు ఎవ‌రిని క‌దిలించినా ఇదే ఫార్ములా వినిపిస్తోంది. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ మూవీ 'బాహుబ‌లి'. ఈ భారీ మూవీని పార్ట్ 1, పార్ట్ 2 గా తెర‌కెక్కించిన రాజ‌మౌళి దేశ వ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించ‌డ‌మే కాకుండా ఈ త‌ర‌హా చిత్రాల‌కు బీజం వేశారు. భారీ స్థాయిలో తెర‌కెక్కిన బాహుబ‌లి, బాహుబ‌లి 2 సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో ఇప్ప‌డు ప్ర‌తీ ఒక్క‌రూ ఇదే ఫార్ములాని అనుస‌రిస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ ఇదే త‌ర‌హా సినిమాల‌ని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. 'బాహుబ‌లి' అందించిన ధైర్యంతో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి 'కేజీఎఫ్' తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. చాప్ట‌ర్ 1 సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో దీనికి సీక్వెల్ గా రీసెంట్ గా చాప్ట‌ర్ 2ని తెర‌పైకి తీసుకొచ్చారు. య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సీక్వెల్ సినిమాల‌కు భారీ ఊత‌మిచ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది.

త్వ‌ర‌లో దీనికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 3 ని తెర‌పైకి తీసుకురానున్న విష‌యం తెలిసిందే. ఇదే పంథాలో పుష్ప‌కు సీక్వెల్ రాబోతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ష‌న్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీకి పార్ట్ 2 రాబోతోంది. ఇక సెట్స్ పై వున్న ప్ర‌భాస్ మూవీ 'స‌లార్‌' కూడా రెండు భాగాలుగా రాబోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఆగ‌స్టు 5న విడుద‌లైన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మూవీ 'బింబిసార‌' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో దీనికి కొన‌సాగింపుగా పార్ట్ 2ని చేయ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించారు. ఇదే కోవ‌లో మ‌రిన్ని సినిమాలు కూడా రెండు పార్ట్ లుగా రానున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా 'ప్రాజెక్ట్ కె'ని కూడా 'బాహుబ‌లి', కేజీఎఫ్‌. పుష్ప‌, బింబిసార, స‌లార్ చిత్రాల‌ త‌ర‌హాలో రెండు భాగాలు గా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

'ప్రాజెక్ట్ కె' కు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగే సైన్స్ ఫిక్ష‌న్ గా తెర‌కెక్కిస్తున్నారు. హిమాల‌యాల్లోని ఓ గుహ‌లోకి వెళ్లిన బృందం మ‌రో కాలానికి వెళ్ల‌డం అనే స‌రికొత్త క‌థ‌గా ఈ మూవీని రూపొందిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

భారీ స్పాన్ వున్న క‌థ కావ‌డంతో ద‌ర్శ‌కుడు రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 'బాహుబ‌లి', కేజీఎఫ్‌. పుష్ప‌, బింబిసార చిత్రాల్లోని ప‌తాక ఘ‌ట్టాల్లో పార్ట్ 2కు లీడ్ ఇచ్చినట్టుగా 'ప్రాజెక్ట్ కె' క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది.