Begin typing your search above and press return to search.

పాడుతా తీయగా... కాస్త బాధగా... ?

By:  Tupaki Desk   |   28 Nov 2021 8:30 AM GMT
పాడుతా తీయగా... కాస్త బాధగా... ?
X
పాడుతా తీయగా. ఇది అమరగాయకుడు ఘంటశాల మూగమనసులు మూవీ కోసం పాడిన పాట. ఆత్రేయ రచన, మామ మహదేవన్ మ్యూజిక్ అక్కినేని వారి అభినయం, సావిత్రి అందమైన రూపం ఈ పాట వెనక నేపధ్యం. ఆ పాట పల్లవిలోని రెండు పదాలను పట్టుకుని పెట్టుకుని పాతికేళ్ల పాటు మరో అమరగాయకుడు బాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. పాడుతా తీయగా అంటే తరువాత జనరేషన్స్ కి బాలూయే కళ్ల ముందు కనిపించారు. ఒక టీవీ చానల్ వచ్చిన ఈ సంగీత కార్యక్రమంగా ఎంతటి ఆదరణ పొందిందో చెప్పనలవి కాదు.

పాడుతా తీయగా ఎంతో మంది కొత్త గాయకులను తెచ్చింది. ఎన్నో గొంతులకు ఊపిరిపోసింది. దాని వెనకాల ఉన్న ఒకే ఒక శక్తి ఎస్పీ బాలు. బాలు సినీ నేపధ్య గాయక జీవితం మరో దశకు చేరుకున్న క్రమంలో వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆయన తన అనుభవాలను, అనుభూతులను ఏకం చేసి మరీ ప్రాణం పోశారు.

పాడుతా తీయగా అంటే కేవలం ఔత్సాహిక గాయనీగాయకులు పాడిన పాటలే కాదు, బాలు చెప్పే వ్యాఖ్యానం. ఆయన ఇచ్చే సూచనలు, చెప్పే మెలకువలు. అన్నింటికీ మించి ఆ పాట వెనకాల ఉన్న వ్యధలు కధలు, తెర ముందుకు రాని ఎన్నో సంగతులు, సంగీత విశేషాలు ఇలా ఒక పాట ప్రాణం పోసుకుని ఎలా చిరంజీవి అయింది. దాని వెనకాల ఎంతటి కఠోర శ్రమ ఉంది ఇవన్నీ బాలు గుదిగుచ్చి చెబుతూంటే వినేవారికి చెవులే తప్ప మరేమీ పనిచేయ‌వంటే ఒట్టు.

బాలు అంటే నడిచే గ్రంధాలయం. ఆయన యాభై అయిదేళ్ల సినీ జీవితాన్ని మొత్తం జనం ముందు పెట్టి అలనాటి వూసులు విశేషాలూ చెబుతూంటే ఎంతటి మధురంగా ఉంటుందో కదా మరి. అందుకే పాడుతా తీయగాకు పోటీగా ఎన్ని సంగీత కార్యక్రమాలు వచ్చినా దాని విలువ దానికే ఉంది. అక్కడ ఉన్నది ఎస్పీ బాలు. అదే దాని ప్రత్యేకత.

ఇపుడు పాడుతా తీయగా మళ్లీ ప్రసారం కాబోతోంది. దాదాపుగా ఏడాదిన్నర తరువాత మళ్లీ మొదలవుతోంది. గత ఏడాది కరోనాతో బాలు కళ్ళు మూశాక ఇక ఉండదు అనుకున్న కార్యక్రమాన్ని ఇపుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. దీని మీద చరణ్ మాట్లాడుతూ ఇది తనకు పెద్ద బాధ్యత అన్నారు. తన తల్లి సహా అందరూ నచ్చచెప్పి ఒప్పిస్తే ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నాను అన్నారు.

నిజమే. ఎస్పీ బాలు ఒక మేరు పర్వతం. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అయితే అక్కడ బాలు కొడుకు ఉంటే కొంతలో కొంత జనాలు సహకరించి ఆదరించే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి డిసెంబర్ 5 నుంచి మొదలయ్యే పాడుతా తీయగా అలరించడం ఖాయం. గాయనీగాయకుల మధుర గీతాలు ఉంటాయి. అన్నీ ముచ్చట్లూ ఉంటాయి. కానీ కేవలం బాలూకే సొంతమైన వ్యాఖ్యానం, అలనాటి ఊసులు, ఆయన మార్క్ చమక్కులు మాత్రం ప్రతీ ఒక్కరు మిస్ అవడం ఖాయం. అందుకే పాడుతా తీయగా అంటూనే కాస్త బాధగా అనుకోవాల్సి వస్తోంది.