Begin typing your search above and press return to search.

ఇద్దరిలో 'పాన్ ఇండియా స్టార్' అనిపించుకునేదెవరు..?

By:  Tupaki Desk   |   6 July 2022 3:05 PM GMT
ఇద్దరిలో పాన్ ఇండియా స్టార్ అనిపించుకునేదెవరు..?
X
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పోటీపడే ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది.

సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR మూవీ బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టించింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ పెర్ఫార్మన్స్ ను నేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడిన తర్వాత ట్రిపుల్ ఆర్ హీరోల క్రేజ్ అన్ని మూలలకు పాకింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ నటించే తదుపరి చిత్రాలపై అందరి దృష్టి పడింది. ఎలాంటి సినిమాలతో రాబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR తెచ్చిపెట్టిన ఇమేజ్ తో హీరోలిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకునే విషయంలో మాత్రం చెర్రీ కంటే తారక్ వెనుకబడి ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా పూర్తైన తర్వాత రామ్ చరణ్ వెంటనే శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. వచ్చే సమ్మర్ ను టార్గెట్ గా పెట్టుకొని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు చరణ్.

మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమాని అధికారికంగా ప్రకటించారు కానీ.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారనే దానిపై ఎలాంటి అఫిషియల్ అప్డేట్ లేదు. ఇది కంప్లీట్ అయితేనే ప్రశాంత్ నీల్ తో తన 31వ చిత్రాన్ని ప్రారంభిస్తారు.

అయితే వచ్చే ఏడాది వేసవికి రావాలని ప్లాన్ చేసుకున్న NTR30 సెట్స్ పై ఉండగానే.. అదే సీజన్ ను లక్ష్యంగా పెట్టుకున్న RC15 చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేయబడుతుంది. ఇక 'సలార్' మూవీ ఆలస్యమైతే మాత్రం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా లేట్ గానే షూటింగుకు వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో చెర్రీ 'జెర్సీ' దర్శకుడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటాడు.

ఎలా చూసుకున్నా 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ సినిమాలే ముందుగా థియేటర్లలోకి వస్తాయి. ఈ విషయంలో మెగా హీరోనే కాస్త ముందుంటారనేది తెలుస్తుంది. కాకపోతే ఎప్పుడు వచ్చినా ఇద్దరిలో ఎవరు పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

'జంజీర్' (తుఫాన్) చిత్రంతో హిందీలో డిజాస్టర్ అందుకున్న చరణ్.. RRR తర్వాత 'ఆచార్య' తో మరో డిజాస్టర్ ను చవిచూశారు. దీంతో ఈ చిత్రాన్ని నార్త్ సర్కూట్స్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్స్ కూడా విరమించుకున్నారు. ఇక తారక్ NTR30 తో హిందీ మార్కెట్ పై కన్నేశారు. ఇద్దరు హీరోలు తమ తదుపరి చిత్రాలతో సక్సెస్ అందుకుంటేనే పాన్ ఇండియా స్టార్స్ గా పరిగణించబడతారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.