Begin typing your search above and press return to search.

నాగార్జున ఇంటిని ముట్ట‌డిస్తాం!

By:  Tupaki Desk   |   17 July 2019 10:14 AM GMT
నాగార్జున ఇంటిని ముట్ట‌డిస్తాం!
X
కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్న `బిగ్ బాస్ - 3` ర‌క‌ర‌కాల వివాదాల‌కు తావిచ్చిన సంగ‌తి తెలిసిందే. యాంక‌ర్ కం జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి- న‌టి గాయ‌త్రి గుప్తా `బిగ్ బాస్` నిర్వాహ‌కుల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. వేధింపుల ప్ర‌హ‌స‌నంపై విచారించాల్సిందిగా పోలీస్ స్టేష‌న్ లో కేసులు పెట్టారు. అటుపై టాలీవుడ్ నిర్మాత.. రాజ‌కీయ నాయ‌కుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి బిగ్ బాస్ 3 పై విచార‌ణ చేప‌ట్టాలంటూ కోర్టుల ప‌రిధిలో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం వేసి పోరాడేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో ఇప్ప‌టికే ఈ సీజ‌న్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈసారి బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఉంటుందా ఉండ‌దా? అన్న డైలెమా నెల‌కొంది.

తాజాగా బిగ్ బాస్ షో వేధింపుల వ్య‌వ‌హారాన్ని నిర‌సిస్తూ ఆ షోని నిలిపేయాల్సిందిగా ఉస్మానియా యూనివ‌ర్శిటీ విద్య‌యార్థులు ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ కి నాగార్జున హోస్టింగ్ చేయ‌డాన్ని విద్యార్థులు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ షోని ఆపేయ‌క‌పోతే బిగ్ బాస్ నిర్వాహ‌కుల ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని.. హోస్ట్ నాగార్జున ఇంటిని ముట్టడించి తీర‌తామ‌ని ప్ర‌క‌టించారు.

ఓ వైపు వివాదాల నేప‌థ్యంలో మ‌రో నాలుగైదు రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ షో మొద‌ల‌వుతుందా? అవ్వ‌దా? అంటూ జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఉస్మానియా విద్యార్థులే నేరుగా రంగంలోకి దిగ‌డంతో ఇది కాస్తా దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మార‌నుంది. ఇలా ఒక కార్య‌క్ర‌మానికి హోస్టింగ్ చేసేందుకు సిద్ధ‌మైనందుకు నాగార్జున‌కు ఈ తిప్ప‌లేంటి? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దానికంటే ఈ షో నుంచి వైదొలిగితేనే బావుంటుంద‌ని అక్కినేని అభిమానులు సైతం అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షో పేరుతో వేధింపుల‌కు తెర తీసిన కార్య‌క్ర‌మ‌ మ‌ధ్య వ‌ర్తులు ర‌ఘు-శ్యాం వంటి వారిని పోలీసులు విచారించ‌నున్నార‌ని తెలుస్తోంది.