Begin typing your search above and press return to search.

ఓటీటీలో ఆ సినిమా స్ఫూర్తితో దారుణ హత్య చేశాడట

By:  Tupaki Desk   |   29 Nov 2021 12:36 AM GMT
ఓటీటీలో ఆ సినిమా స్ఫూర్తితో దారుణ హత్య చేశాడట
X
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఒక దారుణ హత్య పెను సంచలనంగా మారటమే కాదు.. తీవ్రమైన భయాందోళనకు గురి చేసింది. మీసేవ సెంటర్ లో ఆపరేటర్ గా పని చేసే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయటం.. బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి.. తల ఒకచోట.. శరీర భాగాల్ని వేర్వేరు చోట్ల పడేయటం.. పోలీసులు దీన్ని గుర్తించి.. కేసును ఛేదించిన సంగతి తెలిసిందే. ఇంతకీ మీసేవ అపరేటర్ కాంపెల్లి శంకర్ ను ఎందుకంత దారుణంగా చంపటం అన్నది ఒక ప్రశ్న అయితే..అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఎలా చేయగలిగాడు? అన్న ప్రశ్నకు సమాధానం తాజాగా లభించింది.

ఈ హత్య చేసిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ జరపగా.. షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఈ దారుణ హత్యకు ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘‘కోల్డ్ కేస్’’ అనే మలయాళీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూసి ప్లాన్ చేసినట్లుగా వెల్లడైంది. పక్కా ప్లాన్ తో చంపేసి.. తల ఒక కోట.. ఇతర శరీర భాగాల్ని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.దీంతో.. పోలీసులకు దొరకని భావించాడు కానీ.. పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి నిందితుడ్నిఅదుపులోకి తీసుకున్నారు.

మీసేవ ఆపరేటర్ శంకర్ దారుణ హత్యలో శంకర్ భార్యపై అనుమానాలు ఉన్నాయి. అయితే.. ఈ హత్యను తాను మాత్రమే చేసినట్లుగా రాజు చెబుతున్నాడు. భార్యతో విడిపోయ వేరుగా ఉండే రాజు.. అప్పుడప్పుడు సైకోలా వ్యవహరిస్తుంటాడని చెబుతారు.

అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు.. అతను చెప్పిన వివరాలకు అవాక్కు అయ్యారు. తాను యలయాళ మూవీ కోల్డ్ కేస్ సినిమాను చూసి స్ఫూర్తి పొందానని.. అందులో మాదిరి హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

ఇక.. సినిమా విషయంలోకి వెళితే.. కోల్డ్ కేసు సినిమాలో లాయర్ పాత్రధారి.. తన క్లయింట్ కు భరణంగా వచ్చిన డబ్బును కాజేయాలన్న అత్యాశతో సదరు క్లయింట్లను హత్య చేసి.. శరీర భాగాల్ని పాలిథిన్ కవర్లలో చుట్టేసి.. కేరళ.. తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో విసిరేస్తుంటాడు. వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో శరీర భాగాలు దొరకటంతో అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు మిస్టరీగా మిగులుతుంది. ఈ మూవీ ప్రేరణతోనే శంకర్ హత్యకు ప్లాన్ చేశానని చెప్పాడు.

ఇంతకీ.. శంకర్ ను రాజు ఎందుకు హత్య చేశాడన్న విషయంలోకి వెళితే.. ఎన్టీపీసీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది శంకర్ భార్య హేమలత. అదే ఆసుపత్రిలో స్వీపర్ గా పని చేస్తుంటాడు రాజు. వారి మధ్య ఏర్పడిన చనువు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి కారణమైందని చెబుతారు.

అదే ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికురాలిగా శంకర్ తల్లి పని చేస్తుంటుంది. దీంతో కోడలు హేమలత.. స్వీపర్ రాజు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. మూడు నెలల నుంచి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మీద హేమలత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో.. భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి పంపారు.

అయినా ఇద్దరి మధ్య గొడవలు తగ్గని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ నెల 25న హేమలతో శంకర్ దగ్గరగా ఉన్న ఒక అసభ్యకరమైన ఫోటోను భర్త రాజు అతనికి పంపటంతో ఇంట్లో మరోసారి పెద్ద గొడవకు దారి తీసింది. అదే రోజు రాత్రి నైట్ షిఫ్టుకు భార్యను ఆసుపత్రి వద్ద దింపి భర్త శంకర్ వెళ్లిపోయాడు.అనంతరం రాజుకు ఫోన్ చేసి గొడవ పడినట్లుగా చెబుతున్నారు.

దీంతో రాత్రి వేళలో శంకర్ ఇంటికి వెళ్లిన రాజు అతని తలపై పదునైన వస్తువుతో బలంగా కొట్టటంతో చనిపోయినట్లుగా భావిస్తున్నారు. అనంతరం శంకర్ శరీరం మీద ఉన్న దుస్తుల్ని తొలగించి.. వాటిని తగులబెట్టి.. డెడ్ బాడీని సర్జికల్ బ్లేడ్ తో ముక్కలు ముక్కలుగా చేసి.. టూ వీలర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ హత్య భార్య హేమలత ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయం విచారణలో తేలనుంది.