Begin typing your search above and press return to search.

ప‌ద్మాల్లో టాలీవుడ్ జీరో.. మ‌రీ ఇంత అన్యాయ‌మా?

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:54 AM GMT
ప‌ద్మాల్లో టాలీవుడ్ జీరో.. మ‌రీ ఇంత అన్యాయ‌మా?
X
ప‌ద్మ పుర‌స్కారాల్లో ప్ర‌తిసారీ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఏదో ఒక కోణంలో అన్యాయం జ‌రుగుతోంద‌న్న తీవ్ర విమ‌ర్శ ఉంది. ఈసారి మ‌రీ అన్యాయం. క‌నీసం ఒక్క టాలీవుడ్ ప్ర‌ముఖుడి పేరు కూడా ఈ పుర‌స్కారాల్లో లేక‌పోవ‌డం దారుణం అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి అయిన పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం 141 మంది అవార్డు గ్రహీతలు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కేవలం ఐదుగురికి మాత్ర‌మే పుర‌స్కారాలు ద‌క్కాయి. తెలంగాణకు మూడు.. ఎపికి కేవలం రెండు మాత్ర‌మే ప‌ద్మ‌లు ద‌క్కాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీ తారలు ఎవరూ ప‌ద్మాల‌ జాబితాలో చోటు సంపాదించ‌లేక‌పోయారు. అయితే ప్రముఖ బాలీవుడ్ మేక‌ర్ కరణ్ జోహార్.. ఏక్తా కపూర్... పాకిస్తానీ అయిన‌ అద్నాన్ సామి .. రెబ‌ల్ క్వీన్ అయిన‌ కంగనా రనౌత్ సైతం ప‌ద్మ పుర‌స్కారాలు అందుకున్న జాబితాలో ఉన్నారు. వారికి వ‌చ్చాయ‌ని కాదు కానీ.. తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో న‌వ‌ర‌సాల్ని ఔపోష‌ణ ప‌ట్టి ద‌శాబ్ధాల పాటు సేవ‌లందించిన ఎంద‌రో మేటి తార‌లు ప‌ద్మానికి నోచుకోక‌పోవ‌డ‌మే విచిత్రం అన్న మాట వినిపిస్తోంది.

న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ‌గా పాపులారిటీ ఉన్న వెట‌ర‌న్ న‌టుడు కైకాల సత్యనారాయణ పేరు ప‌ద్మ క‌మిటీకి క‌నిపించ‌లేదా? రెబ‌ల్ స్టార్ గా త‌న‌దైన ముద్ర వేసిన‌ కృష్ణంరాజు వంటి వెట‌ర‌న్ స్టార్ పేరు కూడా క‌నిపించ‌లేదా? ఎంద‌రో దిగ్గ‌జాలు ప‌ద్మ అవార్డుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. వీళ్లంద‌రినీ కేంద్రం త‌ర‌పున ప‌ద్మ క‌మిటీ ప్ర‌తిసారీ విస్మరిస్తూనే ఉంది. అవార్డులు పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే మ‌న వెట‌ర‌న్స్ ఎందులో త‌క్కువ‌?

గ‌డిచిన రెండేళ్ల‌లో ప్ర‌ముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతా రామ శాస్త్రి.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి మాత్రమే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పద్మ అవార్డులు వచ్చాయి. ఈ పురస్కారాలను రాష్ట్రపతి భవన్ లో సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి - ఏప్రిల్‌లో జరిగే ఉత్సవాలంలొ భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తున్న సంగ‌తి విదిత‌మే.