Begin typing your search above and press return to search.

వారు తీస్తున్నది సినిమా.. మేము తీస్తున్నది జీవితం

By:  Tupaki Desk   |   14 July 2020 6:50 AM GMT
వారు తీస్తున్నది సినిమా.. మేము తీస్తున్నది జీవితం
X
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ను వెబ్‌ సిరీస్‌ గా ఇంకా రెండు సినిమాలుగా రూపొందిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కూడా జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నాయి. అందరి దృష్టి కంగనా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తలైవి’పై ఉంది. పాన్‌ ఇండియా మూవీగా ఆ చిత్రం విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు రమ్యకృష్ణ నటించిన జయలలిత బయోపిక్‌ వెబ్‌ సిరీస్‌ గా వచ్చేసింది. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో కూడా ఒక బయోపిక్‌ రూపొందుతుంది.

జయలలిత బయోపిక్‌ గురించి తాజాగా నిత్యామీనన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇతరులు ఎంత మంది ఆమె బయోపిక్‌ ను చేసినా తీసినా కూడా అది సినిమానే అవుతుంది. కాని మేము చేసేది మాత్రం ఆమె జీవితాన్ని చూపిస్తుంది. ఆమె జీవితాన్ని ఆమె అభిమానుల ముందు ఆవిష్కరించబోతున్నాం. జయలలిత బయోపిక్స్‌ అన్నింటిలో మాది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను చేస్తున్న బయోపిక్‌ దర్శకుడు జయలలిత గారికి అత్యంత ఆప్తుడు. ఆమె మృతి చెందే వరకు కూడా ఆమెకు సన్నిహితంగా మెలిగాడు. ఆమె జీవితాన్ని చాలా దగ్గరగా చూశాడు. కనుక ఆమె జీవితాన్ని మా సినిమా ద్వారానే పూర్తిగా ఆవిష్కరించే అవకాశం ఉంటుందని నిత్యామీనన్‌ అంటోంది.

ఇతర బయోపిక్‌ లతో మేము చేస్తున్న సినిమాకు అసలు పోటీ లేదని మాది చాలా ప్రత్యేకమైన సినిమా అవ్వడం వల్ల వాటితో పోలిక అనవసరం అంటూ చెప్పుకొచ్చింది. చాలా ప్రత్యేకంగా తమ సినిమా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్న నిత్యామీనన్‌ ‘తలైవి’ సినిమాలో అసలు విషయాన్ని చెప్పక పోవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేసింది. నిత్యామీనన్‌ ‘ది ఐరెన్‌ లేడీ’ ఇంకా కంగనా రనౌత్‌ ల ‘తలైవి’ చిత్రాలు రెండు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది అమ్మ అభిమానుల అభిమానం దక్కించుకుంటాయి.. ఏ సినిమాలో అమ్మ జీవితంను సంపూర్ణంగా ఆవిష్కరిస్తారో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.