Begin typing your search above and press return to search.

స్టార్స్‌ ఏం మాట్లాడినా బలి అవుతూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   12 Aug 2020 7:50 AM GMT
స్టార్స్‌ ఏం మాట్లాడినా బలి అవుతూనే ఉన్నారు
X
సుశాంత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ లో నెపొటిజం గురించి పతాక స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఉన్న స్టార్స్‌ లో చాలా మంది కూడా స్టార్‌ కిడ్స్‌ అవ్వడంతో వాళ్లంతా ఇప్పుడు ప్రతి రోజు ట్రోల్‌ అవుతూనే ఉన్నారు. పొరపాటున ఏదైనా ఇంటర్వ్యూలో లేదా లైవ్‌ ఛాట్‌ లో చిన్న మాట మాట్లాడినా కూడా అడ్డంగా బుక్‌ అవుతున్నారు. నెటిజన్స్‌ వ్యక్తిగతంగా ట్రోల్స్‌ చేయడం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్‌ కు అదే పరిస్థితి వచ్చింది.

బాలీవుడ్‌ లో ఉన్న నెపొటిజంపై ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కాస్త కఠువుగా ఉన్న విషయాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడినది నిజమే అయినా కొందరు మాత్రం ఆమెను టార్గెట్‌ చేశారు. ఇంతకు ఆమె ఏం మాట్లాడినదంటే.. స్టార్స్‌ పిల్లలు సినిమాల్లోకి రావాలని కోరుకునేది ప్రేక్షకులే. స్టార్‌ కిడ్స్‌ సినిమాల్లోకి వస్తే వారిని మళ్లీ స్టార్స్‌ ను చేసేది ప్రేక్షకులే. అంటే ఇక్కడ ప్రేక్షకుల వల్లే స్టార్‌ కిడ్స్‌ స్టార్స్‌ అవుతున్నారు. స్టార్స్‌ పిల్లలు స్టార్స్‌ కావద్దనుకున్నప్పుడు ప్రేక్షకులు వారిని చూడకుంటే సరిపోతుంది. వారి సినిమాలు విడుదలైనప్పుడు చూడకుండా ఉన్నట్లయితే ఒకటి రెండు సినిమాలతోనే వారి కెరీర్‌ ముగుస్తుంది. స్టార్‌ కిడ్స్‌ పిల్లల సినిమాలను చూడమంటూ ప్రేక్షకులను ఎవరు కూడా ఒత్తిడి చేయరు.

ఏ సినిమా అయినా వారి ఇష్టపూర్తిగా చూస్తున్నారు. నచ్చితే అందులో నటీనటులను అభిమానిస్తారు. స్టార్స్‌ ను చేస్తారు. దీనికి నెపొటిజం అనే పేరును పెట్టి విమర్శలు చేయడం ఎందుకు అన్నట్లుగా కరీనా అసహనం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్స్‌ మండి పడుతున్నారు. చాలా మందికి ఆమె వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. తండ్రి సోదరి బ్యాక్‌ గ్రౌండ్‌ తో హీరోయిన్‌ గా వచ్చి సక్సెస్‌ అయిన కరీనా కపూర్‌ కు అసలు నెపొటిజం పై మాట్లాడే అర్హత ఎక్కడిది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలను బ్యాన్‌ చేయాలంటూ కొందరు పిలుపునిచ్చారు. మొత్తానికి కరీనా మాట్లాడిన మాటలు నిజమే అయినా నెటిజన్స్‌ వాటిని పాజిటివ్‌ గా తీసుకోవడం లేదు. ఇలా స్టార్‌ కిడ్స్‌ ఎవరైనా నెపొటిజం గురించి మాట్లాడితే వారు బలి అవుతూనే ఉన్నారు.