Begin typing your search above and press return to search.

పూరీ - అనిల్ రావిపూడి సినిమాలపై బాలయ్య క్లారిటీ..!

By:  Tupaki Desk   |   21 July 2021 10:36 AM GMT
పూరీ - అనిల్ రావిపూడి సినిమాలపై బాలయ్య క్లారిటీ..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా ప్రస్తుతం 'అఖండ' అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు బాలయ్య. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారాక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 'క్రాక్' తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో '#NBK107' మూవీ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య చేయబోయే సినిమాల గురించి ఈ మధ్య అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైనప్ పై నందమూరి నటసింహ క్లారిటీ ఇచ్చారు.

'ఆదిత్య 369' చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ.. 'అఖండ' తర్వాత చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా.. దాని తర్వాత హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ లో ఒక చిత్రం చేయనున్నట్లు బాలయ్య తెలిపారు. అంతేకాదు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇకపోతే 'ఆదిత్య‌ 369' కు సీక్వెల్ గా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు. సీక్వెల్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయ‌ని.. ఈ సినిమాతో త‌న‌యుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని మ‌రోసారి గుర్తు చేశారు. 'ఆదిత్య 999 మాక్స్‌' చిత్రాన్ని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు.