Begin typing your search above and press return to search.

ఓటీటీకి ససేమిరా అంటున్న యువ సామ్రాట్...?

By:  Tupaki Desk   |   18 Sep 2020 11:30 PM GMT
ఓటీటీకి ససేమిరా అంటున్న యువ సామ్రాట్...?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్రస్తుతం ''లవ్ స్టోరీ'' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏసియన్ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్మోహన్ రావ్ కలిసి నిర్మిస్తున్నారు. సున్నితమైన ప్రేమ‌క‌థ‌ల‌ని ఎంతో అందంగా ఆవిష్కరించే శేఖర్ కమ్ముల మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయింది.

కాగా, మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'లవ్ స్టోరీ' మిగతా షూటింగ్ ఈ నెలలోనే కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో అనే క్లారిటీ లేకపోవడంతో ఈ మధ్య సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో.. చైతూ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ ఓటీటీ 'లవ్ స్టోరీ' సినిమాకి రూ.35 కోట్ల వరకు చెల్లించడానికి ముందుకు వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ హీరో నాగ‌చైత‌న్య ని సంప్రదించగా ఓటీటీ రిలీజ్ కి ససేమిరా అన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఎంత ఆఫర్ చేసినా.. ఎంత లేట్ అయినా 'లవ్ స్టోరీ' ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చైత‌న్య కోరుతున్నాడట. దీంతో మేకర్స్ ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.