Begin typing your search above and press return to search.

ఇకపై ఆ సినిమాలకు ప్రభుత్వం నుండి ఎన్‌ఓసీ తప్పనిసరి

By:  Tupaki Desk   |   1 Aug 2020 3:00 PM GMT
ఇకపై ఆ సినిమాలకు ప్రభుత్వం నుండి ఎన్‌ఓసీ తప్పనిసరి
X
ఈమద్య కాలంలో ఇండియన్‌ ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌ లో పలు సినిమాలు వస్తున్నాయి. ఇండియన్‌ ఆర్మీని సినిమాలో ఏదో ఒక విధంగా భాగం చేయడం వల్ల సినిమాకు మంచి మైలేజ్‌ రావడంతో పాటు దేశ భక్తిని పెంపొందించే సినిమా అంటూ ప్రచారం చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇండియన్‌ ఆర్మీ నేపథ్యంలో సినిమాలు వెబ్‌ సిరీస్‌ లు షార్ట్‌ ఫిల్మ్‌ లు ఇంకా డాక్యుమెంటరీస్‌ చాలా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో ఇండియన్‌ ఆర్మీ గురించి తప్పుగా చూపించడంతో పాటు తక్కువ చేసి చూపిస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ కారణంగా ఇండియన్‌ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఎవరు అయినా ఇండియన్‌ ఆర్మీ నేపథ్యంలో సినిమాలు తీయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వం నుండి నో అబ్జెక్షన్‌ సరిఫికెట్‌ ను తీసుకోవాల్సి ఉంది. ముందే స్టోరీ చెప్పి ఎన్‌ఓసీ తీసుకోవడంతో పాటు విడుదల సమయంలో కూడా రక్షణ శాఖకు ఆ సీన్స్‌ ను చూపించి ఆ తర్వాత సినిమా లేదా వెబ్‌ సిరీస్‌ లను విడుదల చేయాలని ఇండియన్‌ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్‌ఓసీ లేని సినిమాలకు ఇకపై సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకూడదంటూ కూడా కేంద్ర నిర్ణయించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్మీ పై సినిమాలు అయితే తగ్గక పోవచ్చు. కాని ఇష్టానుసారంగా సీన్స్‌ ఉండక పోవచ్చు అంటున్నారు. ఇండియన్‌ ఆర్మీ గురించిన ఖచ్చితమైన సమాచారంను మాత్రమే చూపించాలనే నిబందన కూడా తీసుకు రాబోతున్నారు. ఇక ఆర్మీకి సంబంధించిన ఎలాంటి అంతర్ఘత విషయాలను కూడా సినిమాల్లో చూపించేందుకు వీలు లేదు. అలాంటి విషయాలు ఏమైనా ఉంటే సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇచ్చే అవకాశం లేదు.