Begin typing your search above and press return to search.

పవన్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పరస్పర దాడులు.. పలువురికి గాయాలు..?

By:  Tupaki Desk   |   7 Oct 2022 10:44 AM GMT
పవన్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పరస్పర దాడులు.. పలువురికి గాయాలు..?
X
సినీ హీరోల అభిమానుల మధ్య ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ జరగడం మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. ఒకప్పుడు థియేటర్ల వద్ద గొడవపడే వారంతా.. ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిన తర్వాత ఆఫ్ లైన్ లో గొడవలు పడటం కాస్త తగ్గిందని చెప్పాలి. కానీ కొందరి ఫ్యాన్స్ వల్ల అప్పుడప్పుడు పబ్లిక్ గా పరస్పర దాడులు చేసుకున్న ఘటనలు చేసుకుంటుంటాయి.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించిన గొడవ ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో.. ఇరు వర్గాల్లోని పలువురు ఫ్యాన్స్ గాయపడినట్లు తెలుస్తోంది.

విజయవాడలోని ఆగిరిపల్లిలో పవన్ కళ్యాణ్ అభిమానులు కట్టిన ఓ బ్యానర్ ను ఎన్టీఆర్ అభిమానులు కొందరు చింపివేయడంతో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఒకరిపై ఒకరు భౌతికంగా దాడులు చేసుకున్నారని తెలుస్తోంది.

ఇందులో పవన్ - తారక్ అభిమానులు దాదాపు 60-70 మంది పాల్గొనడంతో అగ్లీ ఫైట్ గా మారింది. ఈ ఘర్షణలో పాల్గొన్న వారిలో కొంతమంది గాయపడినట్లు నివేదించబడింది. విజయవాడలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే గొడవ మరింత పెద్దదిగా కాకుండా చూసుకోడానికి ఇరు వర్గాల అభిమానులు చొరవ తీసుకొని.. ఆ వీడియోలు డిలీట్ చేయించి పరిస్థితి చేయిదాటకుండా సర్దుమణిగేలా చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇది అస్సలు ఎన్టీఆర్ వర్సెస్ పీకే ఫ్యాన్స్ గొడవ కాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆగిరిపల్లిలో లోకల్ ఇష్యూ కారణంగా తలెత్తిన వివాదంలోకి హీరోలను ఇన్వాల్వ్ చేయడంతో.. అది ఎన్టీఆర్ vs పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైట్ గా మారిందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియదు కానీ.. ఇద్దరు హీరోల అభిమానులు ఒకరినొకరు కొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ ఘర్షనలో కొద్దిమందికి గాయాలు కావడంతో కొంత మేర నష్టం జరిగిందని చెప్పాలి.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ అభిమానుల మధ్య గతంలోనూ అనేక సందర్భాల్లో గొడవలు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా ఇరు వర్గాల ఫ్యాన్స్ బాహాబాహీకి దిగారు. తారక్ ఫ్యూచర్ సీఎం అని ఆయన ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేస్తే.. పోటీగా పవన్ ఫ్యాన్స్ కూడా అలానే చేయడంతో గొడవ స్టార్ట్ అయింది.

ఇద్దరు హీరోల అభిమానులు కూడా 'సీఎం.. సీఎం' అని నినాదాలు చేస్తూ ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని లాఠీలకు పని చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఏదేమైనా సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ అనేవి చాలా అసహ్యకరమైనవిగా భావిస్తుంటే.. ఇలా భౌతిక దాడులు చేసుకోవడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.