Begin typing your search above and press return to search.

రేపటి నుంచి 'సర్కారు వారి పాట'లో 'మురారి బావ' పాట..?

By:  Tupaki Desk   |   27 May 2022 10:34 AM GMT
రేపటి నుంచి సర్కారు వారి పాటలో మురారి బావ పాట..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబట్టి, మహేశ్ స్టార్ పవర్ ఏంటో చూపించింది. మూడో వారంలో కూడా హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఫాస్ట్ ఫిల్లింగ్ బుకింగ్స్ కనిపిస్తుండటం విశేషం.

అయితే ఈరోజు 'ఎఫ్ 3' సినిమా రిలీజ్ ఉండటంతో.. 'సర్కారు వారి పాట' చిత్రానికి థియేటర్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు మరియు అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి మేకర్స్ సరికొత్త ప్లాన్ తో వస్తున్నారు. అదేంటంటే మహేశ్ సినిమాలో అదనంగా ఓ పాటని జత చేయబోతున్నారు.

'సర్కారు వారి పాట' సినిమా కోసం ఎస్ఎస్ థమన్ స్వరపరిచిన 'కళావతి' 'మా మా మహేష్' పాటలు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే రేపు శనివారం నుంచి 'మురారి బావ' అనే మరో సాంగ్ ని సినిమాలో యాడ్ చేయబోతున్నారని సమాచారం.

నిజానికి 'మురారి బావ' పాటను ముందుగానే చిత్రీకరించగా.. విడుదల తేదీ దగ్గర పడినప్పుడు దాని స్థానంలో 'మా మా మహేషా' వంటి మాస్ సాంగ్ ని పెట్టారు. అయితే అభిమానుల నుంచి రిక్వెస్ట్ కు వెల్లువెత్తడంతో తొలగించిన పాటను త్వరలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

కాకపోతే 'మురారి బావ' పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మూడో వారంలో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి సినిమాలో యాడ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'అడిషన్ సెన్సేషనల్ రాబోతోంది' అంటూ థమన్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు ఊతం ఇస్తోంది.

అయితే 'మురారి బావ' పాటను ఎండ్ టైటిల్స్ లో వేస్తారా లేదా మరేదైనా ప్లేస్ మెంట్ లో యాడ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో అనేక సినిమాలకు విడుదలైన కొన్ని రోజులకును డిలీట్ చేసిన ఫైట్స్ - సాంగ్స్ - సీన్స్ కలపడం జరిగింది. లాంగ్ రన్ కోసం మేకర్స్ ఇలాంటి స్ట్రాటజీలతో వచ్చేవారు.

ఇప్పుడు థర్డ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోడానికి 'సర్కారు వారి పాట' సినిమాకు అదనపు మరో పాటను కలుపుతున్నారని అంటున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. మహేశ్ - కీర్తి సురేష్ లపై షూట్ చేసిన 'మురారి బావ' పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాసారు. అర్మాన్ మాలిక్ - గీతా మాధురి కలిసి ఆలపించినట్లు తెలుస్తోంది.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురాం పెట్లా దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సముద్ర ఖని - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి - 14 రీల్స్ ప్ల‌స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.