Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ చెప్పిందే ముఖేష్ చేశాడు

By:  Tupaki Desk   |   13 Aug 2019 7:38 AM GMT
కమల్ హాసన్ చెప్పిందే ముఖేష్ చేశాడు
X
నిన్న జియో ఫైబర్ ప్రకటన అన్ని రంగాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన జియో 4జి తరహాలో ఇదీ ఇసుక తుపాను మాదిరి పోటీదారులు అందరిని మట్టికరిపించడం ఖాయమని అప్పుడే విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. వినియోగదారులు సైతం ఎప్పుడెప్పుడు ఆల్ ఇన్ వన్ కనెక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆఫర్లు చూసి ఉలిక్కి పడ్డ రంగాలలో సినిమా పరిశ్రమ ఉంది.

వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుంచి తమ సర్వీస్ ద్వారా కొత్త సినిమాలు నేరుగా మొదటి రోజు మొదటి ఆట ఇంట్లోనే చూడొచ్చని ముఖేష్ అంబానీ ప్రకటించడం అందరికి షాక్ కలిగించింది. ఇందులో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా ఒకవేళ నిజంగా జరిగితే థియేటర్ల మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆరేళ్ళ క్రితమే లోకనాయకుడు కమల్ హాసన్ ఇదంతా ఊహించి చెప్పాడు. విశ్వరూపం ఫస్ట్ పార్ట్ సెన్సార్ చిక్కులతో పాటు వివాదాలకు గురైనప్పుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా తన సినిమాను నేరుగా డిటిహెచ్ ద్వారా ఇళ్లకే ప్రసారం చేస్తానని కమల్ ప్రకటించాడు.

కానీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పాటు కమర్షియల్ గా అది వర్క్ అవుట్ కాదని తేలడంతో కమల్ వెనక్కు తగ్గక తప్పలేదు. లేకపోతే అన్నంత పని చేసేందుకు రెడీ అయ్యాడు. టెక్నాలజీ పరంగా అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ముఖేష్ అంబానీ చెప్పినట్టుగా నేరుగా నట్టింటిలోకే సినిమాలు వస్తే టికెట్లకు డబ్బులు ఖర్చుపెట్టుకుని నగరాల్లో దూరాల్లో ప్రయాణించే రిస్క్ ప్రేక్షకులు ఎందుకు తీసుకుంటారు. దీని తీరు ఎలా ఉండబోతోందో తెలియాలంటే మాత్రం ఇంకో ఏడాది దాకా వేచి చూడాల్సి వచ్చేలా ఉంది