Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ ను ఊపేస్తున్న 'బ్యాచ్ లర్'

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:13 AM GMT
బాక్సాఫీస్ ను ఊపేస్తున్న బ్యాచ్ లర్
X
అఖిల్ అందగాడు .. డాన్సులు - ఫైట్లు విషయంలో వంకబెట్టలేనివాడు .. ఆయన కలర్ ముందు గ్లామరస్ హీరోయిన్లే తేలిపోతుంటారు. అలాంటి అఖిల్ తెలుగు తెరపై మొదటి సినిమా నుంచే దుమ్ము రేపేస్తాడని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ఆయన మొదటి మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. అఖిల్ సినిమా అనగానే ఒక రేంజ్ లో ఉండాలని ఫిక్స్ కావడం వలన, భారీతనాన్ని మాత్రమే తప్ప కథను పట్టించుకోలేదు. దాంతో ఆ సినిమాలు దెబ్బతిన్నాయి. ఇక కథల విషయంలో అఖిల్ మరింత జాగ్రత్తపడుతూ రావడంతో ఎక్కువ గ్యాప్ రావడానికి కారణమైంది.

ఈ నేపథ్యంలోనే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే అప్పటి వరకూ అఖిల్ కథల విషయంలో జరుగుతూ వచ్చిన పొరపాట్లను బన్నీవాసు ఈ సినిమాలో సవరిస్తూ వెళ్లాడు. దాంతో ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా సంబరాల మూడ్ లో ఉంది.

తొలి రెండు రోజుల్లో ఈ సినిమా 18 కోట్లకి పైగా రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఆ తరువాత కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. విజయదశమి రోజున వచ్చిన ఈ సినిమా, విజయాన్ని అందుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం రికార్డుగా చెబుతున్నారు. అల్లు అరవింద్ చేతిలో పెడితే అఖిల్ కి హిట్ వస్తుందని అనుకున్న నాగార్జున నమ్మకం నిజమైంది. ఇప్పుడు యూత్ లో ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా ఈ సినిమా వాళ్లకి కనెక్ట్ అయింది.

కథా కథనాలు .. సంగీతం .. ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. అలాగే పూజ హెగ్డే గోల్డెన్ లెగ్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చిందనే వారు కూడా లేకపోలేదు. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కళ్లలో ఆనంద బాష్పాలు రాలేలా చేశాయి అంటే, హిట్ కోసం ఆయన ఎంతగా ఎదురు చూశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా అఖిల్ 'ఏజెంట్' చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, కొంతవరకూ షూటింగు జరుపుకుంది. అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా ద్వారా, సాక్షి వైద్య కథానాయికగా పరిచయం కానుంది.