Begin typing your search above and press return to search.

సామ్ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిన మాస్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 11:30 AM GMT
సామ్ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిన మాస్ డైరెక్టర్..!
X

తెలుగు ప్రేక్షకులకు మాస్ సినిమాల రుచి చూపించిన దర్శకులతో వి.వి. వినాయ‌క్ ఒకరు. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ మాస్ కథలను చెప్తూ కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఒకానొక సమయంలో ప్రతి స్టార్ హీరో కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకున్నారు. 'దిల్' 'ఆది' 'ఠాగూర్' 'బన్నీ' 'లక్ష్మి' 'కృష్ణ' 'అదుర్స్' 'ఖైదీ నెం.150' వంటి సూపర్ హిట్స్ అందించారు వినాయక్. ఈ క్రమంలో ఎంతో మంది హీరోయిన్లతో వర్క్ చేసిన మాస్ డైరెక్టర్.. సమంత అక్కినేని పెర్ఫార్మన్స్ కు ఫిదా అయ్యారట.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్ తీసిన సినిమా ''అల్లుడు శీను''. ఇందులో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో సామ్ తన నటనతో సర్ప్రైజ్ చేసిందని వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ''అల్లుడు శీను లో ఓ బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. అందులో సమంత కెమెరా వైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకోవాలి. నేను షాట్ చెప్పిన వెంటనే గ్లిజరిన్ లేకుండా కళ్ళల్లోంచి నీళ్లు తీసుకొచ్చింది. అది చూసి నేను వండర్ అయిపోయాను'' అని వివి వినాయక్ అన్నారు. అలానే 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో సమంత పెర్ఫార్మన్స్ చాలా బాగుందని.. ఆమెకు ఫోన్ చేసి కూడా చెప్పానని దర్శకుడు తెలిపారు.

ఇకపోతే 'ఇంటెలిజెంట్' సినిమాతో ప్లాప్ అందుకున్న వివి వినాయక్ మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయలేదు. మధ్యలో దిల్ రాజు బ్యానర్ లో నటుడిగా 'శీనయ్య' అనే సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఔట్ పుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిపారు. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను బాలీవుడ్ లో పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘ఛత్రపతి’ రీమేక్ తో వీరిద్దరూ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. భారీ స్కేల్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.