Begin typing your search above and press return to search.

#టికెట్ ఆట‌.. కొత్త అధ్య‌క్షుడు ఏపీ CM ని ఒప్పిస్తాడా?

By:  Tupaki Desk   |   24 Oct 2021 9:30 AM GMT
#టికెట్ ఆట‌.. కొత్త అధ్య‌క్షుడు ఏపీ CM ని ఒప్పిస్తాడా?
X
ఇటీవల నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించిన `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో `మా` అధ్య‌క్షుడిగా మంచు విష్ణు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. నూత‌న అధ్య‌క్షుడిగా పెను స‌వాళ్ల‌ని ఎదుర్కొంటున్న అత‌నికి ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారాడు. అతని ఆరోప‌ణ‌ల‌తో మ‌ళ్లీ టాలీవుడ్ వాతావ‌ర‌ణం హీటెక్కి వార్త‌ల్లో నిలుస్తోంది. ఇదిలా వుంటే నూత‌న అధ్య‌క్షుడు మంచు విష్ణుకు మ‌రో విష‌యం పెను స‌వాల్ గా మారింది.

ఇటీవ‌ల జ‌రిగిన హోరా హోరీ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా గెలిచిన మంచు విష్ణు ముందు మ‌రో కీల‌క స‌మ‌స్య ఎదురుచూస్తోంది. టాలీవుడ్ కు సంబంధించిన స్టార్ హీరోల చిత్రాల‌కు రిలీజ్ స‌మ‌యంలో టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది. కానీ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం అందుకు నిరాక‌రించింది. ఇప్పుడు ఇదే స్టార్ హీరోల సినిమాల‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. మంచు విష్ణు అధ్య‌క్షుడైతే ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడి ఈ పెను స‌మ‌స్య‌ని సామ‌రస్యంగా ప‌రిష్క‌రిస్తాడ‌ని భావించిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అత‌న్ని అధ్య‌క్ష‌పీఠం ఎక్కించారు.

ఇటీవ‌ల ప్ర‌మాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల సీఎంల‌ని తాజా స‌మ‌స్య‌ల‌పై క‌లిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అలాగే ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై కూడా ప‌లువురు వ్య‌క్తం చేస్తున్న అనుమానాల‌ని నివృత్తి చేస్తూ పెద్ద సినిమాల టిక్కెట్ రేట్‌ల‌ని పెంచుకునే వెసులుబాటుని
ప్ర‌భుత్వం క‌ల్పిస్తే అధ్య‌క్షుడిగా మంచు విష్ణు విజ‌యం సాధించిన‌ట్టేన‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కొంత సానుకూలంగా వున్నా ఏపీ ప్ర‌భుత్వం మాత్రం అందుకు స‌సేమీరా అంటోంది. మ‌రి మంచు విష్ణు ఈ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రిని ఒప్పించి అందిరి దృష్టిలో హీరో అవుతారా లేదా అన్న‌ది చూడాల్సిందే. ఇక‌పోతే తెలుగు సినిమా రంగంలో అనాదిగా పేరుకు పోయిన బ్లాక్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా నాశ‌నం చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీవ్ర‌మైన నిర్ణయం తీసుకుంది. ఇండ‌స్ట్రీలో టిక్కెట్ గ్యాంబ్ల‌ర్స్ పై స‌ర్వే చేసి మ‌రీ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ జీవోని ప్ర‌భుత్వం తెచ్చింది. దానిని మార్చే ఆలోచ‌న ఇప్ప‌ట్లో లేద‌ని చెబుతున్నారు. అలాగే ఆన్ లైన్ ప్ర‌భుత్వ పోర్ట‌ల్ తో ట్యాక్స్ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు ఏపీ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌ని సంగ‌తి తెలిసిందే. మంత్రి పేర్ని నానీతో చ‌ర్చ‌ల వ‌ల్ల కొంత‌వ‌ర‌కూ కొన్ని విష‌యాల్లో మాత్ర‌మే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతున్నాయి.

టిక్కెట్టుపై పోరాటం చేయాలేమో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ టిక్కెట్టు రేటు పై ఏపీ ప్ర‌భుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత దానిని క‌వ‌ర్ చేసేందుకు కొంద‌రు నిర్మాత‌లు లైన్ లోకొచ్చారు. కానీ ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యంగా క‌నిపిస్తోంది. జ‌గన్ ప్ర‌భుత్వం కొన్ని సెక్ష‌న్ల‌లో వెసులుబాటు క‌ల్పిస్తూ టిక్కెట్టు పై మాత్రం ఉడుంప‌ట్టు ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి...నాలుగు షోల‌కు అనుమ‌తులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు క‌రోనా కూడా దాదాపు 90 శాతం అదుపులోకి వ‌చ్చింది. దీంతో సినిమా రిలీజ్ ల‌కు అడ్డంకులు పూర్తి స్థాయిలో తొల‌గిపోయాయి. ఈ ద‌స‌రాకి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయి మంచి స‌క్సెస్ అయ్యాయి. రానున్న‌ది దీపావ‌ళి..క్రిస్మ‌స్ కూడా కొంత మంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ త‌ర్వాత జ‌న‌వ‌రిలో సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌ధానంగా అగ్ర హీరోల మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణంతో సినిమా రిలీజ్ కాబోతున్నాయి.

అప్ప‌టికి అన్ని స‌మ‌స్య‌లు అన‌గా టిక్కెట్ రెట్లు పెంచుకునే వెసులు బాటు కూడా ముఖ్య‌మంత్రి క‌ల్పిస్తార‌ని నిర్మాత లు..ఎగ్జిబి ట‌ర్లు.. పంపిణీ దారులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఛాన్స్ ఇప్ప‌ట్లో ఎంతమాత్రం లేద‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆన్ లైన్ టిక్కెటింగ్ పై ఏపీ ప్ర‌భుత్వం పోర్ట‌ల్ ని సిద్ధం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై టిక్కెట్ అమ్మ‌కాలన్నీ ఆ పోర్ట‌ల్ ద్వారానే జ‌రుగుతాయి. ఈ పోర్ట‌ల్ 2022 లో అందుబాటులోకి రానుంద‌ని స‌మాచారం. అప్ప‌టివ‌ర‌కూ టిక్కెట్ రేట్లు పెంచే ఉద్దేశం ఏపీ ప్ర‌భుత్వానికి లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న..ప్ర‌భుత్వం నిర్ధేశించిన పాత‌ ధ‌ర‌లతోనే అప్ప‌టివ‌ర‌కూ అమ్మ‌కాలు జ‌ర‌గాల‌ని మ‌రోసారి అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేయ‌డానికి రంగం సిద్ద‌మ‌వుతోందిట‌. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను బేఖాత‌రు చేసి బ్లాక్ దందా కొన‌సాగిస్తే గ‌నుక థియేట‌ర్ల‌ని శాశ్వ‌తంగా మూసేసే ఏర్పాట్లు జ‌రుగుతాయ‌ని హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోందట‌. మొత్తానికి మ‌రోసారి ఎగ్జిబిట‌ర్లుకు ప‌రిశ్ర‌మ‌కు షాక్ లు త‌ప్ప‌ద‌నే తెలుస్తోంది.