Begin typing your search above and press return to search.

శ్రియ డేట్లు ఇప్పిస్తామని రూ.5లక్షలు కొట్టేశారట!

By:  Tupaki Desk   |   17 Nov 2019 4:45 AM GMT
శ్రియ డేట్లు ఇప్పిస్తామని రూ.5లక్షలు కొట్టేశారట!
X
మోసపోయే వారుండాలే కానీ.. మోసం చేయటానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయన్న విషయాన్ని చూపిస్తున్నారు స్వాహారాయుళ్లు. ఒకప్పుడు సంఘంలో మీడియా ప్రతినిధి అన్నంతనే మర్యాద.. గౌరవం ఉండేది. ఇప్పుడవన్నీ పోయి.. బెదిరించటం.. భయపెట్టటం.. తమకుండే పవర్ ను దుర్వినియోగం చేసే మీడియా ప్రతినిధులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఒక విలేకరితో పాటు.. మరో మహిళపై కేసులు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు.

ప్రముఖ నటి శ్రియాను ఒక రియాల్టీ షోలో జడ్జిగా వ్యవహరించేందుకు రూ.5లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న వైనం ఇప్పుడు కేసుగా మారింది. ఒక పత్రికలో (ఇప్పుడు మూసేశారు) పని చేసే విలేకరి చైతన్య. బంజారాహిల్స్ కు చెందిన సినీ దర్శకుడు చంద్రనాయుడు ఒక చానల్ లో భారీ ఎత్తున రియాల్టీ షోను నిర్వహించేందుకు వీలుగా ప్లాన్ చేశాడు. అన్ని సిద్ధం చేసుకున్న అతడు.. ఆ షోలో జడ్జిగా శ్రియ నటిస్తే బాగుంటుందనుకున్నాడు.

ఆమె డేట్ల కోసం ప్రయత్నిస్తున్న వేళ.. రిపోర్టర్ చైతన్య పరిచయమయ్యాడు. తన అవసరం గురించి చెప్పినంతనే.. శ్రియ డేట్లను చూస్తారంటూ ఆమె మేనేజర్ అంటూ లక్ష్మీ సింధూజను పరిచయం చేశాడు. శ్రియ డేట్స్ ను ఇప్పించేందుకు అడ్వాన్స్ గా రూ.5లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి చైతన్య.. లక్ష్మీ సింధూజ పత్తా లేకుండా పోయారు.

వివిధ మార్గాల్లో వారిని కాంట్రాక్టు చేసే ప్రయత్నం చేయటం.. ఫలితం లేకపోవటంతో తాను మోసపోయినట్లు గుర్తించిన చంద్రాయుడు బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనకు ఎదురైన మోసాన్ని వారికి చెప్పారు. దీంతో అతడిచ్చిన కంప్లైంట్ ను కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తన పేరుతో దోచేస్తున్న వైనం తెలిస్తే శ్రియ అవాక్కు అవుతారేమో?