Begin typing your search above and press return to search.

అమరవీరుడికి 'మేజర్' టీమ్ ఘన నివాళి..!

By:  Tupaki Desk   |   26 Nov 2021 5:30 PM GMT
అమరవీరుడికి మేజర్ టీమ్ ఘన నివాళి..!
X
2008 నవంబర్ 26న ముంబై ఉగ్రవాదుల దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో వీరమరణం పొందిన అమరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ కు ''మేజర్'' చిత్ర బృందం ఈరోజు శుక్రవారం నివాళులు అర్పించారు. వర్సటైల్ యాక్టర్ అడవి శేష్ ప్రధాన పాత్రలో సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా 'మేజర్' అనే వార్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ప్రతి ఏడాది ఇదే రోజున సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌ ని సందర్శిస్తుంటారు. అయితే ఈసారి ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో కలిసి 'మేజర్' టీమ్ 26/11 నాటి వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ టవర్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో అడివి శేష్ తో పాటుగా హీరోయిన్ సైఈ మంజ్రేకర్ కూడా హాజరయ్యారు.

అంతకుముందు ముంబయి పోలీస్ స్మారక చిహ్నం వద్ద 26/11 నాటి అమరవీరులకు అడివి శేష్ నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ''26/11 తేదీన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ ని గుర్తుచేసుకోవడానికి అతని చివరి విశ్రాంతి స్థలంలో మేము సమావేశమవుతున్నాం. ఈ నివాళి కోసం నేను అంకుల్ మరియు ఆంటీ (సందీప్ తల్లిదండ్రులు) లతో కూర్చుంటాను. ఆ చీకటి రోజున మన దేశం కోసం పోరాడిన వీరందరికి నివాళి'' అని గురువారం శేష్ ట్వీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

కాగా, 'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా.. అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే సమకూర్చారు. అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 11న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

తెలుగుతో పాటుగా హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - 'మేజర్' టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాలో శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.