Begin typing your search above and press return to search.

ఒక సాధారణ కమర్షియల్ సినిమా కోసమా ఇన్నేళ్ల గ్యాప్ తీసుకుంది..?

By:  Tupaki Desk   |   12 May 2022 5:30 PM GMT
ఒక సాధారణ కమర్షియల్ సినిమా కోసమా ఇన్నేళ్ల గ్యాప్ తీసుకుంది..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడు కోరుకుంటారు. మహేశ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే తానేంటో నిరూపించుకోవాలని కలలు కంటుంటారు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం డైరెక్టర్ పరశురామ్ పెట్లా (బుజ్జి) కు వచ్చింది.

'యువత' సినిమాతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పరశురామ్.. 'సోలో' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ క్రమంలోనే మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. 'ఒక్కడు' సినిమా చూసి ఇండస్ట్రీలో అడుగుపెట్టానని చెప్పే పరశురాం.. తన అభిమాన హీరో మహేశ్ తో మూవీ చేయడం తన డ్రీమ్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ''సర్కారు వారి పాట'' సినిమా తెరకెక్కించారు.

2018 లో 'గీత గోవిందం' చిత్రం పూర్తైనప్పటి నుంచి దర్శకుడు సర్కారు వారి ప్రాజెక్ట్ మీదనే పని చేసాడు. మధ్యలో అక్కినేని నాగచైతన్య ఓ మూవీ అనౌన్స్ చేసాడు కానీ.. మహేశ్ నుంచి పిలుపు రావడంతో దాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళకుండా హోల్డ్ లో పెట్టాడు.

ఎలాగైతేనేం SSMB27 ని సెట్స్ మీదకు తీసుకెళ్లి.. మధ్యలో కరోనా పాండమిక్ వల్ల బ్రేక్ పడినా.. అన్నీ దాటుకుని SVP చిత్రాన్ని పూర్తి చేశాడు పరశురాం. ఫస్ట్ లుక్ లో మహేశ్ ను సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేసి అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇక ట్రైలర్ లో చూపించిన మహేశ్ మాస్ స్వాగ్ కు ఫిదా అయిపోయారు. ట్రైలర్ కు వంద రెట్లు సినిమా ఉంటుందని అంచనాలు పెంచేశారు. 'పోకిరి' + 'గీతగోవిందం' = 'సర్కారు వారి పాట' అని చెబుతూ హైప్ క్రియేట్ చేశారు.

మహేష్ బాబుతో సినిమా తన లైఫ్ టైం అచీవ్మెంట్ అని.. ఈ కథ పుట్టిందే మహేష్ కోసమని అని అంచనాలు రెట్టింపు చేశారు. ఇలా భారీ అంచనాల మధ్య గురువారం SVP మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

అయితే తొలి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. మహేశ్ లాంటి స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినా.. దర్శకుడు పరశురాం సద్వినియోగం చేసుకోలేకపోయారని కామెంట్స్ వస్తున్నాయి.

మంచి ప్లాట్ పాయింట్ తీసుకొని సూపర్ స్టార్ ని సరికొత్త అవతార్ లో చూపించడంలో సక్సెస్ అయినా.. ఓవరాల్ గా ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలం అయ్యారని అంటున్నారు. లాజిక్స్ లేకుండా ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సాదాసీదా సినిమా తీశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నాలుగేళ్లు ఈ సినిమా మీదే వర్క్ చేసినా మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారని అంటున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు పరశురాం ఒక సాధారణ కమర్షియల్ సినిమా కోసం అసలు ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్నలు వస్తున్నాయి.