Begin typing your search above and press return to search.

మ‌హేష్ 27 కి థ‌మ‌న్ ఫిక్స్ అయ్యారా?

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:23 AM GMT
మ‌హేష్ 27 కి థ‌మ‌న్ ఫిక్స్ అయ్యారా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడిగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ప‌ర్మినెంట్ గా ఫిక్స్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి దేవీని కాద‌ని ఎంబీ 27కి థ‌మ‌న్ ని ఎంపిక చేశారా? అంటే అవున‌నే స‌మాచారం. సంక్రాంతి పందెంలో మ్యూజిక్ ప‌రంగా దేవీపై థ‌మ‌న్ పై చేయి సాధించాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు పాట‌ల కంటే అల వైకుంఠ‌పుర‌ములో సాంగ్స్ కి శ్రోత‌ల్లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అల వైకుంఠ‌పుర‌ములో సక్సెస్ లో సంగీతం కీల‌క పాత్ర పోషించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స‌రిగ్గా అదే కార‌ణం ఇప్పుడు దేవీశ్రీ కొంపలు ముంచిందా? అంటే అవున‌నే మాట్లాడుకుంటున్నారంతా.

ఇటీవ‌ల థ‌మ‌న్ జోరు మామూలు గా లేదు. అత‌డు సంగీతం అందిస్తున్న ప్ర‌తి ఆల్బ‌మ్ లోనూ రెండు మూడు పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి అద్భుత‌ రెస్సాన్స్ వ‌స్తోంది. చార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలుస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. వ‌రుస‌గా అర‌వింద స‌మేత‌... అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌కు త్రివిక్ర‌మ్ తో ప‌ని చేసిన థ‌మ‌న్ .. స‌క్సెస్ లో కీల‌క భాగ‌స్వామి అయ్యాడు. ప్ర‌తిభ ప‌రంగా మ‌రో లెవ‌ల్ చూపించాడు. గ‌తంతో పోలిస్తే థ‌మ‌న్ ఇప్పుడు అప్ డేటెడ్ గా క్రియేటివ్ గా సంగీతం అందిస్తున్నాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇటీవ‌ల పూర్తిగా పాత పంథాని వ‌దిలి కొత్త పంథాలో వెళ్తున్నాడు. అదే అత‌డికి ప్ల‌స్ అవుతోంది.

ఇక ఘంట‌సాల మ‌న‌వడి గా అత‌డికి ప‌రిశ్ర‌మ‌ లో ఉన్న క్రేజు ప్ర‌తిసారీ ప్ల‌స్ అవుతోంది. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడిగాను థ‌మ‌న్ టాప్ వ‌న్ స్లాట్ లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ 27వ సినిమాకు థ‌మ‌న్ ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఫిక్స్ చేశార‌ని భావిస్తున్నారు. మ‌హ‌ర్షి ఫేం వంశీ పైడిప‌ల్లి ఎంబీ 27కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ విదేశాల నుంచి టూర్ ముగించుకుని ఇండియా కు తిరిగా రాగ‌నే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. మ‌హేష్ తిరిగొచ్చేస‌రికి స‌ర్వం సిద్దం చేస్తున్నాడ‌ట‌. దీనిలో భాగంగా న‌టీన‌టులు...టెక్నిక‌ల్ టీమ్ ను ఫైన‌ల్ చేశాడ‌ని తెలుస్తోంది.

తాజాగా సంగీత ద‌ర్శ‌కుడి గా థ‌మ‌న్ ని ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఇదే నిజ‌మైతే రాక్ స్టార్ దేవి శ్రీకి మ‌హేష్ కాంపౌండ్ లో పంచ్ ప‌డిన‌ట్టే. గ‌త కొన్నాళ్లుగా మ‌హేష్ సినిమాల‌న్నింటికీ వ‌రుస‌గా దేవీనే సంగీతం అందిస్తున్నాడు. దేవి అంటే ఓ భ‌రోసా.. ధైర్యం అనే న‌మ్మ్మకం మ‌హేష్ కి ఉంది. ఆ మాట‌ను ఆయ‌న ప‌దే ప‌దే వేదిక‌ల‌పైనే చెబుతుంటారు. కానీ ఇప్పుడా న‌మ్మ‌కం స‌డ‌లింద‌నే భావించాల్సి ఉంటుంది. స‌రిలేరు నీకెవ్వ‌రుకి దేవీశ్రీ స‌రిగా న్యాయం చేయ‌లేక‌ పోయాడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలోనే మ‌హేష్ - పైడిప‌ల్లి ఈ నిర్ణ‌యం తీసుకున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. గ‌తంలో మ‌హేష్ న‌టించిన దూకుడు- బిజినెస్ మెన్ చిత్రాల‌కు థ‌మ‌న్ సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్స్ అందించ‌డం అత‌డికి ప్ల‌స్ అయ్యింద‌ని భావించాల్సి ఉంటుంది.