Begin typing your search above and press return to search.

'మానాడు' తెలుగు రీమేక్ వెనుక ఇంత కథ నడిచిందా..?

By:  Tupaki Desk   |   14 Jan 2022 2:30 AM GMT
మానాడు తెలుగు రీమేక్ వెనుక ఇంత కథ నడిచిందా..?
X
తమిళ హీరో శింబు - ఎస్ జే సూర్య - కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ''మానాడు''. టైం లూప్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ విశేష స్పందన తెచ్చుకుంది.

దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ఫలానా నిర్మాత రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు 'మానాడు' సినిమాకు సంబంధించిన తెలుగు డబ్బింగ్ రైట్స్ తో పాటు.. అన్ని భాషల రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికో బ్యాక్ స్టోరీ ఉంది.

వాస్తవానికి హీరో శింబు 'మానాడు' సినిమాతో మళ్ళీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని ట్రై చేశాడు. 'రివైండ్' పేరుతో డబ్బింగ్ చేసి టీజర్ కూడా వదిలాడు. ఆ తర్వాత దీని పేరుని 'ది లూప్' గా చేంజ్ చేసి, గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అల్లు అర్జున్ - బన్నీ వాసు సహాయంతో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయారు.

అయితే 'మానాడు' నిర్మాతలు ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ దగ్గుబాటి రానాకు సంబంధించిన కాస్టింగ్ ఏజెన్సీ క్వాన్ కి సేల్ చేసేలా అగ్రీమెంట్ ఇచ్చేశారట. ఈలోపు సినిమా తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఆ సినిమాను తామే తెలుగులో రీమేక్ చేస్తామని.. డబ్బింగ్ చేసి విడుదల చేయొద్దని మానాడు టీమ్ కి రానా టీమ్ ఓ ఆఫర్ ఇచ్చారట.

తమిళ నిర్మాతలకు ఆ అఫర్ నచ్చడంతో డబ్బింగ్ చేసే ఆలోచన మానుకొని.. ఇప్పుడు తెలుగు రీమేక్ లో సురేష్ బాబుతో పాటుగా భాగస్వామ్యులుగా చేరుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇకపోతే 'మానాడు' రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పెట్టడానికి మేకర్స్ ట్రై చేస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా ఇండస్ట్రీకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా దగ్గుబాటి వారసుడుని లాంచ్ చేస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ క్రమంలో అభిరామ్ తో తమిళ బ్లాక్ బస్టర్ 'మానాడు' తెలుగు రీమేక్ రూపొందించాలని చూస్తున్నారట.

ఇదిలా ఉంటే 'మానాడు' సినిమా ఇటీవలే సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అయితే మేకర్స్ తెలుగు వెర్సన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మన ఆడియన్స్ ఆల్రెడీ సినిమా చూసేశారు. అలాంటి మూవీని ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.