Begin typing your search above and press return to search.

ఖాన్ త్రయాన్ని కావాలని కెలుకుతున్నారా?

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:30 AM GMT
ఖాన్ త్రయాన్ని కావాలని కెలుకుతున్నారా?
X
ఒక‌ప్పుడు బాలీవుడ్లో హ‌వా అంతా ఖాన్ త్ర‌యానిదే. షారుఖ్ ఖాన్ - ఆమిర్ ఖాన్ - స‌ల్మాన్ ఖాన్ ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డుతూ.. ఒక‌రిని మించి ఒక‌రు హిట్లు కొట్టేవాళ్లు. రికార్డుల‌న్నీ వాళ్ల పేరుతోనే ఉండేవి. వాళ్ల మార్కెట్‌ - ఫాలోయింగ్‌ తో పోలిస్తే మిగ‌తా హీరోలు ఎక్క‌డో ఉండేవాళ్లు. హృతిక్ రోష‌న్ ఒక్క‌డు ఖాన్ త్ర‌యానికి పోటీ ఇచ్చేవాడు. కానీ గ‌త కొన్నేళ్ల‌లో క‌థ మారింది. షారుఖ్ ఖాన్ వ‌రుస ఫ్లాపుల‌తో పాతాళానికి ప‌డిపోయాడు. ఆమిర్ ఖాన్ సినిమాకు సినిమాకు మ‌రీ ఎక్కువ‌ గ్యాప్ తీసుకోవ‌డం ద్వారా క్రేజ్ త‌గ్గించుకున్నాడు. పైగా అత‌డి చివరి సినిమా థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఫ్లాప్ అయింది. స‌ల్మాన్ కూడా ఫ్లాపుల్లో ప‌డి కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇదే స‌మ‌యంలో అక్ష‌య్ కుమార్ - అజ‌య్ దేవ‌గ‌ణ్‌ - ర‌ణ్ వీర్ సింగ్ లాంటి హీరోలు వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లిపోతున్నారు. ఒక‌ప్పుడు వంద కోట్ల లోపే ఉన్న వీళ్ల మార్కెట్ ఇప్పుడు రూ.200 కోట్లు దాటిపోయింది. ఈ ముగ్గురూ కూడా రూ.250 కోట్ల గ్రాస్ సినిమాల్ని అందించ‌డం విశేషం. వీళ్లు ఇప్పుడు ఖాన్ త్ర‌యానికి స‌వాలు విసిరే స్థాయిలో ఉన్నారు. ఇంత‌కుముందు ఖాన్‌ ల సినిమాలొస్తే వాటికి పోటీనే ఉండేది కాదు. భ‌య‌ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. సై అంటే సై అంటున్నారు.

పైన చెప్పుకున్న ముగ్గురు హీరోలు క‌లిసి ఓ సినిమాలో త‌ళుక్కుమ‌న‌బోతుండ‌టం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. హిట్ మెషీన్‌గా పేరున్న రోహిత్ శెట్టి డైరెక్ష‌న్ లో అక్ష‌య్ న‌టించిన సూర్య‌వంశీలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ - ర‌ణ్‌ వీర్ సింగ్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. ఇంత‌కుముందు ర‌ణ్ వీర్ హీరోగా న‌టించిన సింబాలో అజ‌య్‌ తో రోహిత్ చేయించిన‌ క్యామియో హైలైట్ అయింది. ఇప్పుడు అక్ష‌య్‌కు తోడుగా అజ‌య్‌ - ర‌ణ్ వీర్‌ లిద్ద‌రినీ దించుతున్నాడు రోహిత్. మార్చి 27కు అనుకున్న ఈ చిత్రాన్ని మూడు రోజుల ముందుకు తీసుకొచ్చి భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. కొన్ని సెల‌క్టివ్ ఏరియాల్లో 24 గంట‌ల పాటు నిర్విరామంగా సినిమాను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఈ కాంబినేష‌న్ - ఈ హంగామా చూస్తుంటే ఈ ముగ్గురు హీరోలు క‌లిసి ఖాన్ త్ర‌యానికి స‌వాలు విసురుతున్న‌ట్లే ఉంది.