Begin typing your search above and press return to search.

RRR లో అవి మాత్రమే చూశానంటూ.. రసూల్ కు కౌంటర్ గా కీరవాణి వరుస ట్వీట్స్..!

By:  Tupaki Desk   |   6 July 2022 7:30 AM GMT
RRR లో అవి మాత్రమే చూశానంటూ.. రసూల్ కు కౌంటర్ గా కీరవాణి వరుస ట్వీట్స్..!
X
RRR సినిమాపై సౌండ్ ఇంజనీర్​, ప్రఖ్యాత అస్కార్​ గ్రహీత రసూల్​ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 'ఆర్.ఆర్.ఆర్' అనే చెత్త సినిమా 30 నిమిషాలు చూశానని బాలీవుడ్ దర్శకుడు మనీష్ భరద్వాజ్ ట్వీట్ చేయగా.. అదొక 'గే లవ్ స్టోరీ' అని రసూల్ రిప్లై ఇవ్వడంతో వివాదం చెలరేగింది.

రసూల్ కామెంట్స్ తో తీవ్ర ఆగ్రహానికిలోనైన సినీ అభిమానులు మరియు పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు గట్టి కౌంటర్​లు ఇస్తున్నారు. ఇప్పటికే 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ లో రసూల్ తీరుని ఎండగట్టారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రంగంలోకి దిగాడు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి అద్భుతమైన సంగీతం సమకూర్చిన కీరవాణి.. రసూల్​ ను ఉద్దేశిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంగా చేసిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్​ టాపిక్​ గా మారాయి. "ఇంగ్లీష్​ అక్షరాలు టైప్​ చేయడం సరిగ్గా రాదు. అప్పర్​ కేస్​, లోయర్​ కేస్​ టైపింగ్​ లో బ్యాడ్​. కాని నేను రసూల్ పూకుట్టితో సహా ప్రతి వ్యక్తి యొక్క భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తాను" అని ట్వీట్ చేశారు.

అయితే రసూల్​ పూకుట్టి ఇంటి పేరులోని కొన్ని అక్షరాలను అప్పర్​ కేస్​ లో టైప్​ చేసి హైలైట్​ చేయడం వల్ల.. అది తెలుగులో ఒక అసభ్యపదజాలంగా ఉందనేది క్లారిటీగా అర్థమవుతోంది. దీంతో ఆయన ట్వీట్​ వైరల్​ గా మారింది. కీరవాణి ట్వీట్ కు కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొంతమంది నెగెటివ్ కామెంట్లు చేశారు. దీంతో ఆ ట్వీట్​ ను డిలీట్​ చేశారు.

అయితే ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. తన టైపింగ్​డిఫెక్ట్ పోయిందని.. కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌ నెస్‌ వచ్చిందని కీరవాణి పేర్కొన్నారు. ''నేను ఇప్పుడు RRR నుండి రామ్ మరియు భీమ్ పాత్రలను చూడలేకపోతున్నాను (స్పెషల్ రిలేషన్ ఉందని చూస్తున్నారో వారి మాదిరిగానే). అపహరణకు గురైన తన కూతురు మల్లి కోసం జీవితాంతం ఎదురుచూసే తల్లి మాత్రమే నాకు కనబడుతోంది. నా దృష్టి త్వరలో మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.

''స్వాతంత్ర్యం కోసం వందల మందికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చిన దేశభక్తుడిగా నేను అజయ్ దేవగన్ సర్‌ ని కూడా చూస్తున్నాను. ఓ మై గాడ్.. కానీ నేను మరెవరినీ ఎందుకు చూడలేకపోతున్నాను? హే ఎన్టీఆర్ - హే చరణ్ - హే అలియా.. దయచేసి నా అంధత్వానికి నన్ను క్షమించండి. నా డాక్టర్ ను ఇంత ఎర్లీగా సంప్రదించలేను'' అని కీరవాణి మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

తాను ఇటీవలే 61వ ఏట అడుగుపెట్టానని.. జుట్టు నరిసి ఊడిపోయి బట్టతల వచ్చేసిందని.. చూపు కూడా మందగించిందంటూ కీరవాణి మరో ట్వీట్ చేశారు. అయితే రసూల్ కు కౌంటర్ గా చేసిన ఈ ట్వీట్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ డిలీట్ చేయడం గమనార్హం. కాకపోతే అప్పటికే ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి.