Begin typing your search above and press return to search.

నయన్ ని పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   28 May 2020 2:58 PM GMT
నయన్ ని పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్...!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సౌత్ ఇండియన్ బ్యూటీ నయనతారను పొగడ్తలతో ముంచెత్తింది. కత్రినా కైఫ్ నయన్ ని ప్రశంసించడం ఏంటి.. అసలు వీరిద్దరికి ఎప్పుటి నుంచి పరిచయముంది అని ఆలోచిస్తున్నారా.. అవును వీరిద్దరూ ఒక షూట్ లో కలిశారు. కానీ వీరు కలిసింది సినిమా షూటింగ్ లో కాదు. ఓ యాడ్ షూట్ లో కలుసుకున్నారు. ఈ వాణిజ్య ప్రకటన షూట్ లో ఈ ఇద్దరు బ్యూటీలు మనసువిప్పి మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా నయనతారపై కత్రినా కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కత్రినా కైఫ్ 'కే బ్యూటీ' అనే బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. ఈ 'కే బ్యూటీ' కోసం కత్రినా అన్ని ఇండస్ట్రీలలో ఫేమస్ హీరోయిన్స్ తో యాడ్ షూట్స్ జరిపింది.

ఈ నేపథ్యంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతారతో కూడా ఒక యాడ్ షూట్ జరిపింది. ఈ షూట్ సందర్భంగా వారిద్దరూ కలిసి సంతోషంలో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. నయనతారతో పంచుకొన్న అనుభూతులకు సంబంధించిన వీడియోను కత్రినా తన సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ సమయంలో నయనతారతో బిజీగా ముచ్చటిస్తూ అనేక విషయాలు చర్చించుకొన్నట్టు ఈ వీడియోలో కనిపించింది. తన కోసం యాడ్ షూట్ కి వచ్చిన నయనతార గురించి కత్రినా కైఫ్ స్పందిస్తూ.. ''ఎంతో బిజీ షెడ్యూల్‌ను కూడా పక్కన పెట్టి కే బ్యూటీ క్యాంపెయిన్ కోసం ముంబైకి వచ్చిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతారకి పెద్ద థ్యాంక్స్. నయనను కలిసిన తర్వాత ఆమె గొప్పతనం మరింత తెలిసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ... ఆమెను కలువాలనుకొంటున్న కోరిక ఇప్పుడు తీరింది'' అని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆమె గురించి మాట్లాడుతూ.. నయనతారను సెట్‌ లో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందని.. ఆమెను చూస్తే మానసికంగా ధృడమైన మహిళగా కనిపించారని.. ఆమెలో ఓ ఫైటర్‌ ను చూశానని.. నన్ను నేను చూసుకొన్నానా అనే ఫీలింగ్ కలిగిందని నా టీమ్‌ తో చెప్పానని.. నయన్ ని కలిసిన రోజు నా జీవితంలో ఓ మ్యాజిక్ డే అని నయన్ పై కత్రినా కైఫ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ 'బూమ్' సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఆ తర్వాత హీరో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. వెంటనే బాలకృష్ణతో 'అల్లరి పిడుగు'లో నటించి తర్వాత బాలీవుడ్‌ కు తన మకాం మార్చింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది. బాలీవుడ్‌ లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చిన వారందరికి పోటీనిస్తూ దూసుకుపోయింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తోంది.