Begin typing your search above and press return to search.

యంగ్ హీరోని పొగిడిందే క‌ర‌ణ్ ని తిట్టేందుకా?

By:  Tupaki Desk   |   22 May 2022 1:30 AM GMT
యంగ్ హీరోని పొగిడిందే క‌ర‌ణ్ ని తిట్టేందుకా?
X
ఒక‌రిని పొగ‌డ‌టం అంటే ఇంకొక‌రిని తెగ‌డ‌టం అని అనుకోవాలా? అందునా అయిన దానికి కాని దానికి న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడే కంగ‌న ఎప్పుడు ఎవ‌రిని ఏ కోణంలో తిడుతోందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన‌ న‌ట‌వార‌సురాలు అనన్యా పాండేని త‌న‌దైన శైలిలో వెట‌కారంతో చిన్న చూపు చూసింది. ఇప్పుడు కూడా ఇంచుమించు అలాంటిదే ఇది.

క‌ర‌ణ్ జోహార్ లు రోష‌న్ లు ఉన్న ఈ ఇండ‌స్ట్రీలో ఒక యువ‌హీరో సాధించిన విజ‌యం ఇదీ! అంటూ ప‌రోక్షంగా త‌న శ‌త్రువుల‌ను దెప్పి పొడిచింది. మీకు ఇలాంటి విజ‌యం సాధ్య‌మేనా? అని కూడా కంగ‌న విస్ప‌ష్ఠంగా ప్ర‌శ్నించింది.

కార్తీక్ ఆర్యన్ - కియారా అద్వానీ జంట‌గా న‌టించిన 'భూల్ భూలయ్యా 2' హిందీ బాక్సాఫీస్ వద్ద డ్రై స్పెల్ ను ముగించినందుకు కంగ‌న స్వ‌యంగా ప్రశంసించారు. తాను న‌టించిన‌ ఢాకడ్ తో పోటీప‌డుతూ రిలీజైన కార్తిక్ ఆర్యన్ - కియారా అద్వానీల భూల్ భూలయ్యా 2 బాక్సాఫీస్ వద్ద విజ‌యం సాధించ‌డంపై ఆనందం వ్య‌క్తం చేసింది క్వీన్.

ఈ రెండు చిత్రాలు మే 20న విడుదలయ్యాయి. హార్రర్ కామెడీ మూవీ భూల్ భుల‌యా 2 మొదటి రోజున రూ. 14.11 కోట్లు వసూలు చేయగా,.. కంగనా ర‌నౌత్ ధాకడ్ మొదటి రోజున రూ. 50 లక్షల వ‌సూళ్ల‌తో ఫ్లాప్ షోగా నిలిచింద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే భూల్ భుల‌యా 2 చిత్రం విజయం సాధించినందుకు కార్తీక్ -కియారాలను అభినందించడానికి కంగనా శనివారం ఇన్ స్టాను ఆశ్ర‌యించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద డ్రై స్పెల్ ను ముగించినందుకు భూల్ భూలయ్యా 2కి అభినందనలు... చిత్ర బృందం మొత్తానికి అభినందనలు.. అంటూ కంగనా ఈ పోస్ట్‌లో కార్తీక్ - కియారా ఇద్దరినీ ట్యాగ్ చేసింది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భులయ్యా 2లో ఆ ఇద్ద‌రితో పాటు టబు - రాజ్‌పాల్ యాదవ్ త‌దిత‌రులు నటించారు.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో భూల్ భూలయ్యా 2 భారతదేశంలో మొత్తం రూ.14.11 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. కార్తీక్ అద్భుత‌మైన‌ ఓపెనింగ్ ను అందుకున్నారు. ఈ చిత్రం కార్తీక్ ఆర్యన్ కి అతిపెద్ద ఓపెనర్ గా నిలిచిందని కూడా త‌ర‌ణ్ పేర్కొన్నాడు.

కంగన నటించిన తలైవి- పంగా- జడ్జిమెంటల్ హై క్యా ఆశించిన విజ‌యాలు సాధించ‌లేదు. ఇప్పుడు ఢాకడ్ కూడా ఫెయిలైంది. ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానున్న తేజస్ లో కంగనా త‌దుప‌రి కనిపించనుంది. తేజస్ తో పాటు, కంగనా ఎమర్జెన్సీ అండ్ ది అవతారం - సీత వంటి చిత్రాల్లో న‌టిస్తోంది.

ఎమ‌ర్జెన్సీ మూవీ కాన్సెప్ట్ ఆస‌క్తిక‌రం. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి కంగనా ఒక ప్రకటనలో ఇలా చెప్పింది. “మళ్ళీ దర్శకుడిగా మార‌డం ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీలో ఒక సంవత్సరం పాటు పనిచేసిన తరువాత నా కంటే బాగా ఎవరూ దర్శకత్వం వహించలేరని నేను కనుగొన్నాను. అద్భుతమైన రచయిత రితేష్ షాతో కలిసి పనిచేయడం వివిధ యాక్టింగ్ అసైన్ మెంట్స్ పై క‌స‌ర‌త్తు చేయడం వ‌ల్ల‌ నేను దీన్ని చేయగ‌ల‌న‌ని నిశ్చయించుకున్నాను. నాలో ఉత్సాహం ఎక్కువ. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అవుతుంది.. అని తెలిపింది.

ఎమర్జెన్సీ అనేది బయోపిక్ కాదని పొలిటిక‌ల్ డ్రామా అని కంగ‌న‌ స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ.. "ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదు. ఇది గ్రాండ్ పీరియాడికల్ ఫిల్మ్. సరిగ్గా చెప్పాలంటే ఇది ప్రస్తుత భారతదేశం లో సామాజిక-రాజకీయ దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి నా తరానికి సహాయపడే రాజకీయ డ్రామా చిత్రం" అని కంగ‌న వెల్ల‌డించారు.