Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ని కుంగ‌దీస్తూ మ‌హేష్ కి కంగ‌న మ‌ద్ధ‌తు

By:  Tupaki Desk   |   13 May 2022 5:35 AM GMT
బాలీవుడ్ ని కుంగ‌దీస్తూ మ‌హేష్ కి కంగ‌న మ‌ద్ధ‌తు
X
``బాలీవుడ్ న‌న్ను భ‌రించ‌లేదు.. నేను నా టైమ్ వేస్ట్ చేసుకోలేను!`` అంటూ సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేసిన హాట్ కామెంట్ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. హిందీ చిత్ర‌సీమ ప్ర‌ముఖుల‌ను ఈ కామెంట్ కంగారు పెట్టింది. బాలీవుడ్ తెలుగు ప‌రిశ్ర‌మ కంటే గొప్ప‌ది కాదా? అనే సందేహం కూడా రైజ్ అయ్యింది కొంద‌రిలో. గుమ్మ‌డికాయ దొంగ‌ల్లా త‌డుముకున్నారు కొంద‌రైతే.

ఏది ఏమైనా మ‌హేష్ ఆత్మ‌విశ్వాసం తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ఉన్న గౌర‌వం ఎంతో గొప్ప‌ది అని ప్రూవ్ అయ్యింది. నిజానికి ఆయ‌న వివాదాస్ప‌దుడు కాక‌పోయినా ఆత్మ‌గౌర‌వంలో కొండంత‌. మ‌హేష్ కామెంట్ పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇంత‌కుముందు దీనిపై ఫిలిం మేకర్ ముఖేష్ భట్ కూడా స్పందించారు. ఇప్పుడు ఈ టాపిక్ కి కొన‌సాగింపుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మహేష్ బాబుకు మద్దతుగా నిలిచింది.
బాలీవుడ్ తనను భరించడం లేదన్న‌ మహేష్ బాబు వ్యాఖ్య‌తో కంగనా రనౌత్ ఏకీభవించింది. దిల్లీలో ఢాకడ్ రెండవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియా విలేకరులు మహేష్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు త‌న మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించింది.

ఆయ‌న (మ‌హేష్‌) చెప్పింది నిజ‌మే.. నేను దీనితో ఏకీభవిస్తున్నాను. తనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆఫర్లు వస్తాయని నాకు తెలుసు. హై జనరేషన్ నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమను భారతదేశంలోనే నంబర్ వన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మార్చారు. కాబట్టి బాలీవుడ్ క‌చ్చితంగా అతనిని భరించదు. అత‌డు తన పరిశ్రమ పట్ల గౌరవం చూపించాడు. దానిని ఎవరూ కాదనలేరు. తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేసిందేమీ లేదనేది మనం (బాలీవుడ్) కాదనలేం. గత 10-15 ఏళ్లలో వారు కష్టపడి తమిళ చిత్ర పరిశ్రమను కూడా వదిలిపెట్టి ఎదిగారు. వారి నుంచి మాత్రమే మనం నేర్చుకోగలం`` అని కంగనా పేర్కొంది.

కంగనా రనౌత్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి అన్నివేళ‌లా వ్యతిరేకంగా గళం విప్పుతార‌న్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ లు క‌పూర్ లు కుమార్ లు భ‌న్సాలీలు య‌ష్ రాజ్ లు అంద‌రికీ కంగ‌న వ్య‌తిరేకం. ద‌క్షిణాది సినిమాల గొప్ప‌త‌నాన్ని కీర్తించేందుకు త‌ను ఎల్ల‌పుడూ ముందుంటుంది. న‌ట‌వార‌స‌త్వాన్ని తూట్లు పొడిచేందుకు కంగ‌న వెన‌కాడ‌దు. ఇటీవ‌లి కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ ద‌క్షిణాది బ‌యోపిక్ ల‌లో న‌టిస్తూ కూడా కంగ‌న హాట్ టాపిక్ గా మారింది. మ‌ణిక‌ర్ణిక త‌ర్వాత ధాక‌డ్ లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టించింది. ధాక‌డ్ ఈ నెల‌లో విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న ద‌క్కింది. కంగ‌న భార‌త‌దేశంలోని సూప‌ర్ లేడీగా ఇప్ప‌టికే ప్ర‌కంప‌నాలు రేపుతోంది. మ‌న మ‌హేష్ కి మ‌ద్ధ‌తిచ్చిన క్వీన్ కి ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.

మ‌హేష్ క‌న్న‌డ న‌టుడు అంటూ!

బాలీవుడ్ న‌న్ను భ‌రించ‌లేదు! అంటూ మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌లు మీడియా డిబేట్ల‌కు తావిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు బాలీవుడ్ సెలబ్రిటీలను కలచివేసాయి. ముఖేష్ భట్ -బోనీ కపూర్ వంటి బి-టౌన్ నిర్మాతలు మహేష్ ని విమ‌ర్శించారు.

ఈ వ్యాఖ్యలపై జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే ఒక ఛానల్ మహేష్ ను తెలుగు నటుడని కాకుండా కన్నడ నటుడు అని వ్యాఖ్యానించ‌డం ఇప్పుడు మ‌రో వివాదానికి కార‌ణ‌మైంది.

ప్రముఖ న్యూస్ ఛానల్ సీఎన్.ఎన్ న్యూస్ లైవ్ టెలివిజన్ లో మహేష్ బాబును కన్నడ నటుడిగా పేర్కొంది. దక్షిణ భారతీయుల పట్ల నార్త్ ఇండియన్ మీడియా అవివేక వైఖరిని ఇది మరోసారి రుజువు చేస్తోంది.

గతంలో కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణించినప్పుడు ఒక ప్రముఖ జర్నలిస్ట్ చిరంజీవి ఫోటోను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఓ న్యూస్ ఛానెల్ మహేష్ ను కన్నడ నటుడని పేర్కొంది. నెటిజ‌నం ఇప్పుడు ఈ వార్త కు సంబంధించిన‌ స్నాప్ షాట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మరియు న్యూస్ ఛానెల్ అజ్ఞానాన్ని ట్రోల్ చేస్తున్నారు.