Begin typing your search above and press return to search.

ఈసారి సినీ పద్మాలు ఎవరంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:37 AM GMT
ఈసారి సినీ పద్మాలు ఎవరంటే?
X
పద్మపురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం.. సినీ రంగానికి చెందిన వారిని సైతం గుర్తించింది. ఈసారి పద్మ పురస్కారాలు వరించిన వారిలో నలుగురిలో ఇద్దరు బాలీవుడ్ క్వీన్లు ఉండటం విశేషం. ఎప్పుడూ లేని రీతిలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మహిళా అగ్ర నటి కంగానా రౌనత్ ను ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. సినీ రంగానికి సంబంధించి నలుగురికి పద్మ పురస్కారాలు వరిస్తే.. ఆ నలుగురు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కావటం ఒక విశేషమైతే.. వారిలో ఒక్కరు కూడా వెటరన్నర్ లు లేకపోవటం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. నచ్చిన సినిమాలే చేస్తూ.. నచ్చినట్లు మాట్లాడటమే కాదు.. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే కంగనాకు పద్మశ్రీ పురస్కారం వరించింది.

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కంగనా బాలీవుడ్ క్వీన్ గా పలువురు అభివర్ణిస్తుంటారు. ఇటీవలే ఆమె నటించిన పంగా మూవీ రిలీజ్ అయి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా.. ఎలాంటి అండా లేకుండా ఎదిగిన కంగనా ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా నిత్యం పోరాడే తత్త్వం ఉండే ఆమెకు పద్మశ్రీ వరించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. తనకు లభించిన పద్మశ్రీ పురస్కారం మీద ఆమె స్పందించారు. భారతదేశ నటిగా తనకు లభించిన గుర్తింపునకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని ప్రతి తల్లికి.. కూతురుకు.. ధైర్యంగా కలల్ని సాకారం చేసుకునే ప్రతి భారత మహిళకు అంకితమిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. పద్మశ్రీ వరించిన వారిలో మరో బాలీవుడ్ మహిళ ఏక్తా కపూర్. బాలీవుడ్ దిగ్గజ నటుడు జితేంద్ర.. శోభా కపూర్ దంపతుల గారాల పట్టీ అయిన ఏక్తా.. తండ్రి సహకారంతో బాలాజీ టెలీ ఫిలింస్ సంస్థపై పెద్ద ఎత్తున సినిమాలు.. సీరియల్స్ ను నిర్మిస్తున్న వైనం తెలిసిందే. విజయవంతమైన వెబ్ సిరీస్ లను కూడా ఆమె నిర్మించారు. బాలీవుడ్ లో ఆమెను క్వీన్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్ గా అభివర్ణిస్తుంటారు.

బాలీవుడ్ లోని వివిద రంగాలకు సంబంధించి పట్టు ఉండటమే కాదు.. తనను తాను ఫ్రూవ్ చేసుకున్న విలక్షణ వ్యక్తి కరణ్ జోహార్ కు పద్మశ్రీ పురస్కారం వరించింది. నటుడిగా.. టీవీ హోస్టుగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రియాలిటీ షో జడ్జిగా.. ఇలా ఒకటేమిటి వినోదరంగానికి సంబంధించిన తిరుగులేని ఈతరం దిగ్గజంగా అభివర్ణించే ఆయనకు చెందిందే ధర్మా ప్రొడక్షన్ సంస్థ. ఇక.. పాక్ తండ్రి.. లండన్ లో పుట్టి ఎయిర్ ఫోర్సులో పైలట్ గా పని చేసిన అద్నాన్ సమీ..బాలీవుడ్ సింగర్ గా ఫేమస్. హిందీ.. తెలుగు భాషల్లో ఎన్నో విజయవంతమైన పాటల్ని ఆయన పాడారు. ఆయనకు కూడా ఈసారి పద్మశ్రీ పురస్కారం లభించింది.