Begin typing your search above and press return to search.

రేపు 'ఎన్టీఆర్ ఘాట్'కి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తారక్...!

By:  Tupaki Desk   |   27 May 2020 10:45 AM GMT
రేపు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తారక్...!
X
రేపు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి. ప్రతి ఏడాది సీనియర్ ఎన్టీఆర్ జయంతి నాడు కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి తమ తాతకి నివాళులు అర్పించకూడదని జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొనియున్న పరిస్థితులే అని అర్థం అవుతోంది. కాగా ఇన్నేళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ జయంతికి ఘాట్ వద్ద నివాళులు అర్పించకపోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

మామూలుగా అయితే ప్రతి ఏడాది మే 28న 'ఎన్టీఆర్ జయంతి' సందర్భంగా కుటుంబ సభ్యులు అనేకమంది అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించేవారు. కానీ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ వారు అక్కడికి చేరుకుంటే పెద్ద ఎత్తున జనాలు నందమూరి అభిమానులు గుమిగూడితే అవకాశం ఉంది. దీని వలన మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అందువల్లనే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూనియర్ ఎన్టీఆర్ తమ తాత జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయలేదని అసహనానికి గురై.. తనే స్వయంగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చూసుకున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లకపోయినా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వారి ఇంట్లోనే ఉంటూ వారి తాతగారికి నివాళులు అర్పించబోతున్నారట. కాగా నందమూరి నట వారసులుగా ఎన్టీఆర్ మనవళ్లుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. కళ్యాణ్ రామ్ తన తాత పేరు మీదుగా 'ఎన్టీఆర్ ఆర్ట్స్' బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలను కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తాతగారి పోలికలతో పుట్టిన ఎన్టీఆర్ నటనలో కూడా తాతని గుర్తు చేసేలా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.