Begin typing your search above and press return to search.

'లైగర్‌' కోసం జాన్వీకపూర్‌.. మళ్లీ మిస్‌ అయ్యిందట

By:  Tupaki Desk   |   18 Aug 2022 7:30 AM GMT
లైగర్‌ కోసం జాన్వీకపూర్‌.. మళ్లీ మిస్‌ అయ్యిందట
X
విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించిన విషయం తెల్సిందే. తాజాగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పూరి మాట్లాడుతూ.. లైగర్ సినిమా కోసం మొదట జాన్వీ కపూర్‌ ను అనుకున్నాం. విజయ్‌ దేవరకొండకి జోడీగా జాన్వీ కపూర్‌ అయితే బాగుంటుందని భావించాం. ఆమెను సంప్రదించాం. కాని ఆమె డేట్లు కుదరక పోవడం వల్ల నో చెప్పింది. దాంతో జాన్వీ కపూర్‌ కి బదులుగా అనన్య పాండేతో వెళ్లాల్సి వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాద్‌ చెప్పుకొచ్చాడు.

జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమా ల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదని.. అందుకే విజయ్ దేవరకొండ సినిమాకు ఆమె నో చెప్పింది అంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

లైగర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభించిన సమయంలో జాన్వీ కపూర్‌ కన్ఫర్మ్‌ అయినట్లుగానే అంతా భావించారు. కాని ఆమె డేట్లు లేకపోవడం వల్ల అనన్య ను రంగంలోకి దించవలసి వచ్చిందని పూరి చెప్పుకొచ్చాడు.

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి మరో సినిమా గా జనగనమణ సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఆ సినిమా లో కూడా హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ ను సంప్రదించారట. ఇప్పుడు కూడా ఆమె డేట్లు లేక పోవడం వల్ల జనగనమణ సినిమా ను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నది కూడా ఏమీ లేదు. అయినా కూడా ఆమె పూరి సినిమాకు ఎందుకు డేట్లు ఇవ్వడం లేదో అర్థం అవ్వడం లేదు అంటూ నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ అంటే అభిమానం అంటూ గతంలో పేర్కొన్న జాన్వీకపూర్‌ ఎందుకు ఆయనకు జోడీగా నటించేందుకు ఒప్పుకోవడం లేదు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.