Begin typing your search above and press return to search.

ఇట్లు మారేడుమిల్లి.. టీమ్ ఇంత శ్ర‌మించారా?

By:  Tupaki Desk   |   28 Jun 2022 7:00 AM GMT
ఇట్లు మారేడుమిల్లి.. టీమ్ ఇంత శ్ర‌మించారా?
X
గ‌త ఇర‌వైఏళ్ల సినీ ప్ర‌యాణంలో హీరో అల్ల‌రి న‌రేష్ త‌నదైన మార్కు కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కే ప్ర‌ధాన్యం ఇస్తూ వ‌చ్చారు. ఆయ‌న‌తో అత్య‌ధిక శాతం అంటే నూటికి 99 శాతం ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డ్డారు. కానీ ఒక్క‌రిద్ద‌రు ద‌ర్శ‌కులు మాత్ర‌మే న‌రేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అలా కొత్త పంథాలో న‌రేష్ ని ఆవిష్కిస్తూ 'నేను', ప్రాణం వంటి సినిమాలు రూపొందారు.

ఇవి న‌రేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించాయి. అయితే ఆ త‌రువాత న‌రేష్ తో ఈ త‌ర‌హా చిత్రాలు చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. కామెడీ చిత్రాల్లో న‌టించ‌డం మొనాట‌నీగా ఫీల‌వుతున్న త‌రుణంలో అల్ల‌రి న‌రేష్ ని కొత్త‌గా ఆవిష్క‌రించిన మూవీ 'నాంది'. న‌రేష్ ని సీరియ‌స్ పాత్ర‌లో చూపించి స‌రికొత్త ఇమేజ్ ని అందించింది. కామెడీ సినిమాలే కాదు.. కొత్త త‌ర‌హా సినిమాలు కూడా న‌రేష్ చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించింది. ఈ మూవీ అందించిన ఉత్సాహంతో ఇప్ప‌డు అల్ల‌రి న‌రేష్ ఇదే పంథాని అనుస‌రిస్తూ కొత్త త‌ర‌హా సినిమాలు చేస్తున్నారు.

అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం'. రాజ్ మోహ‌న్ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. హాస్య మూవీస్ బ్యాన‌ర్ పై జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజేష్ దండ‌, ఏఆర్ మోహ‌న్ నిర్మిస్తున్నారు. మారేడు మిల్లి అడ‌వుల్లో టీమ్ షూటింగ్ చేస్తోంది. 55 రోజుల పాటు ఈ మూవీ కోసం టీమ్ యుద్ధం చేసింద‌ని చెప్పొచ్చు. కెమెరామెన్‌, డైరెక్ట‌ర్ ఈ మూవీ షూటింగ్ కోసం రిస్క్ లు చేస్తూ షూట్ చేసిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజాగా మంగ‌ళ‌వారం ఈ మూవీ ప్రీ టీజ‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఆనంది హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ప్రీ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రోప్ ల స‌హాయంతో కెమెరామెన్ ని ఓ హీమ్యాన్ , స్పైడ‌ర్ మ్యాన్ చెట్ల మ‌ధ్య వేలాడ‌దీసి షూట్ చేసిన విజువ‌ల్స్ చాలా హైలైట్ గా నిల‌వ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఒక్కో లొకేష‌న్ కు చేరుకోవ‌డానికి టీమ్ కు కాలిన‌డ‌క‌న నాలుగు గంట‌లు ప‌ట్టేద‌ట‌. కొండ‌లు, గుట్టు.. వాగులు వంక‌లు, చెట్లు.. తుప్ప‌ల్లో న‌డుస్తూ టీమ్ తో పాటు హీరో, హీరోయిన్ కాలిన‌డ‌క‌న లొకేష‌న్ కు చేరుకున్నార‌ట‌.

250 మంది టీమ్ సైనికుల్లా ఈ మూవీ షూటింగ్ కోసం శ్ర‌మించార‌ని తెలుస్తోంది. 22 అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన లొకేష‌న్ ల‌లో షూట్ చేశార‌ట‌. అంతే కాకుండా మారేడు మిల్లి అడ‌వుల్లో వున్న వంజాంగి కి ఉద‌యం 3 గంట‌ల‌కే వెళ్లేవార‌ట‌.

ఇందు కోసం టీమ్ 6 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ట్రెక్కింగ్ చేయ‌డం విశేషం. ప్ర‌మాద‌మ‌ని తెలిసినా సినిమా ఔట్ పుట్ కోసం 'ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం' టీమ్ రిస్క్ చేయ‌డం విశేషంగా చెబుతున్నారు. ఈ మూవీ టీజ‌ర్ ని జూన్ 30న విడుద‌ల చేయ‌బోతున్నారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీకి రామ్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.