Begin typing your search above and press return to search.

రాజమౌళి ఇప్పటికి ఆ ట్వీట్ కు కట్టుబడి ఉన్నారా?

By:  Tupaki Desk   |   2 Aug 2020 6:30 AM GMT
రాజమౌళి ఇప్పటికి ఆ ట్వీట్ కు కట్టుబడి ఉన్నారా?
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మీద ఇప్పుడు హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్ర గవర్నర్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో..సాంకేతిక అంశాలు మినహాయిస్తే.. ఏపీకి మూడు రాజధానుల రాష్ట్రంగా మారుతుందని చెప్పక తప్పదు. గవర్నర్ బిల్లును ఆమోదించిన తర్వాత జరిగే ప్రక్రియ మొత్తం సాంకేతికంగానే చూడాలి. ఎందుకంటే.. ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే.. మొదటే గవర్నర్ ఆమోదముద్ర వేసి పంపటం అన్నది ఉండదన్నది మర్చిపోకూడదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మూడు రాజధానుల అంశంపై గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేసిన పోస్టు ఒకటి చర్చకు వస్తోంది. కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఆ సమయానికి ఏపీలో మూడు రాజధానుల వ్యవహారమే చర్చకు లేదు. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న విషయం మీద చర్చ మాత్రమే నడుస్తుంది తప్పించి.. ఒక రాజధాని ఏర్పాటు చేయాలా? రెండు రాజధానులు ఏర్పాటు చేయాలన్న దానిపై ఎవరూ ఆలోచించని పరిస్థితి.

ఎన్నికలకు కాస్త ముందుగా (2014, మార్చి 11)ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అందులో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ సందేశాన్ని షేర్ చేశారు. ఆ పోస్టు పెట్టటం ద్వారా జేపీ ఆలోచనలకు తన మద్దతు ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. ఆ పోస్టులో రాయలసీమలో ఉన్న ఖనిజాలకీ.. కోస్తాలో ఉన్న తీర ప్రాంతానికి బాగా డెవలప్ కావొచ్చొని.. న లోక్ సత్తాకు కానీ అధికారం ఇస్తే.. ఐదేళ్లలో ఏపీని దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలుపుతామన్న సందేశం ఆ పోస్టులో ఉంది.

ఏపీకి రాజధాని ఎన్ని ఉండాలన్న ఆలోచన ఎవరికి లేని వేళలోనే.. మూడు.. నాలుగు ఉండాలన్న జేపీ ఆలోచనకు జై కొట్టిన రాజమౌళి ఇప్పుడెలా రియాక్టు అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో లోక్ సత్తాకు ఒక్కసీటు రాకపోవటం.. అధికారం టీడీపీ-బీజేపీకి హస్తగతం కావటం తెలిసిందే. తర్వాతి కాలంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి.. కొన్ని భవనాల్ని నిర్మించటం తెలిసిందే.

ఈ ప్రక్రియలో అమరావతిని ఎలా డిజైన్ చేయాలన్న దానిపైనా రాజమౌళిని ప్రత్యేకంగా చంద్రబాబు పిలిపించుకొని చర్చలు జరపటాన్ని మర్చిపోకూడదు. సినీ దర్శకుడ్ని రాజధాని నగరం ఎలా డిజైన్ చేయాలన్న విషయం మీద పిలిపించుకొని మాట్లాడటం.. అధికారులతో కలిసి కూర్చోబెట్టటంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమరావతి విషయంలో కీలకంగా వ్యవహరించిన రాజమౌళి.. తన పాత స్టాండ్ కు కట్టుబడి ఉన్నారా? అన్న దానిపై కాస్తంత క్లారిటీ ఇస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.