Begin typing your search above and press return to search.

దిల్ రాజు 'ఆ ముగ్గురు'పై చ‌ర్చ మొద‌లైందా?

By:  Tupaki Desk   |   11 Aug 2022 7:29 AM GMT
దిల్ రాజు ఆ ముగ్గురుపై చ‌ర్చ మొద‌లైందా?
X
టాలీవుడ్ షూటింగ్ ల బంద్ ప్ర‌క‌టించి అప్పుడే ప‌ది రోజులు దాటి పోయింది. దీనికి ప్ర‌ధాన భూమిక పోషించిన వ్య‌క్తి స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుత క్రైసిస్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే టికెట్ రేట్ల‌తో పాటు సినిమా బ‌డ్జెట్ లు, స్టార్ ల రెమ్యున‌రేష‌న్ లు అదుపులో వుండాల‌ని బ‌లంగా వాదిస్తూ గిల్డ్ లో చ‌క్రం తిప్పారు. మొత్తానికి అనుకున్న విధంగా టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ కు అంతా ఏక‌తాటిపైకి వ‌చ్చేలా చేశారు.

ఆ త‌రువాత త‌ను త‌మిళ హీరో విజ‌య్ తో చేస్తున్న 'వార‌సుడు' షూటింగ్ ని కంటిన్యూ చేయ‌డం, అదేమంటే అది తెలుగు సినిమా కాదు.. త‌మిళ సినిమా అని లాజిక్ చెప్ప‌డంతో ఇదే త‌ర‌హాలో మ‌రో నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ త‌ను త‌మిళ హీరో ధ‌నుష్ తో నిర్మిస్తున్న 'సార్' సినిమా షూటింగ్ ని కూడా కంటిన్యూ చేయ‌డం తో నిర్మాత‌ల్లో ఒక్క‌సారిగా ముస‌లం మొద‌లైంది. మీకో న్యాయం మాకో న్యాయ‌మా అంటూ బాహాటంగానే విమ‌ర్శ‌ల‌కు దిగార‌కు.

ఇదిలా వుంటే తాజాగా ఆగ‌స్టు 5న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టించిన 'బింబిసార‌' విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుంది. అదే రోజున విడుద‌లైన క్లాస్ ల‌వ్ స్టోరీ 'సీతారామం' కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ క్లాసిక్ గా నిలిచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసేలా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంది. దీంతో గ‌ట‌త రెండు నెల‌లుగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని గ‌గ్గోలు పెట్టిన నిర్మాత‌ల్లో స‌రికొత్త జోష్‌, ధైర్యం మొద‌లైంది. ఈ రెండ సినిమాలు అందించిన ధైర్యంతో ఇండ‌స్ట్రీ మొత్తం ఇప్పుడు క‌ళ‌క‌ల‌లాడుతోంది.

ఇదిలా వుంటే 'బింబిసార‌' స‌క్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ముగ్గురు వ్య‌క్తులు క‌లిస్తేనే ఇలాంటి విజ‌యాలు సొంత మ‌వుతాయ‌ని నొక్కి మ‌రీ చెప్ప‌డం ఇప్ప‌డు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ద‌ర్శ‌కుడు, హీరో, నిర్మాత‌.. ఈ ముగ్గురు త‌లుచుకుంటేనే సినిమా హిట్ అవుతుంద‌ని, దీని బ‌డ్జెట్ కానీ, విజ‌యం కానీ ఈ ముగ్గురి చేతుల్లోనే వుంటుంది. ఈ ముగ్గురు ఎప్నుడూ సినిమాని ప్రేమిస్తూ ముందుకు వెళితేనే స‌క్సెస్ లు ఈజీగా వ‌స్తాయ‌ని 'బింబిసార‌' సీతారామం' చిత్రాల‌తో ప్రూవ్ అయింది. మేజ‌ర్‌, విక్ర‌మ్ త‌రువాత వ‌చ్చిన ఏ సినిమా కూడా ఆడ‌లేదు. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. ఎలా అని అనుకుంటున్న త‌రుణంలో క‌థ‌ల ద‌గ్గ‌రి నుంచి అన్ని విష‌యాల‌పై చ‌ర్చిస్తూ వ‌స్తున్నాం. బింబిసార‌, సీతారామం విడుద‌లై ఇండ‌స్ట్రీకి ఊపిరి పోశాయి.

పాండ‌మిక్ త‌రువాత సినిమా ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్లాలంటే హోమ్ వ‌ర్క్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నాం. ఈ స‌మ‌యంలో ఈ చిత్రాన్ని నిర్మించి గొప్ప విజ‌యాన్ని అందుకున్న హ‌రి గారు మాకంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారు' అని దిల్ రాజు అన్న‌మాట‌లు ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీశాయ‌ని తెలుస్తోంది. హీరో, డైరెక్ట‌ర్‌, నిర్మాత ఈ ముగ్గురు క‌రెక్ట్ గా వుంటే ఏదైనా సాధ్య‌మే అని అన్న‌మాట‌ల‌కు కొంత మంది నొచ్చుకున్నార‌ట‌. భారీ స్థాయిలో స్టార్ హీరోల‌కు పారితోషికాలు ఇస్తూ చుక్క‌ల నంటే బ‌డ్జెట్ ల‌తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత‌లు చాలా మందిని దిల్ రాజు వ్యాఖ్య‌లు హ‌ర్ట్ అయ్యేలా చేశాయ‌ట‌.

ఒక అగ్ర నిర్మాత ఇటీవ‌ల త‌న గెస్ట్ హౌస్ లో కొంత మంది నిర్మాత‌ల‌కు పార్టీ ఇచ్చార‌ట‌. ఆ పార్టీలో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లే ప్ర‌ధాన చ‌ర్చ‌గా నిలిచాయ‌ని చెబుతున్నారు. కొంత మంది ఈ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డితే మరి కొంత మంది సెటైర్లు వేశార‌ట‌. తాజా వివాదం తో బండ్ల గ‌ణేష్ అన్న‌ట్టుగా గిల్డ్ ఉట్టి డొల్లే అని తేలిపోయింద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.