Begin typing your search above and press return to search.

ఆ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేశాడా..??

By:  Tupaki Desk   |   14 July 2020 11:30 PM GMT
ఆ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేశాడా..??
X
ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠ‌పురంలో' సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్క చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బ‌న్నీ బర్త్‌డే సంద‌ర్భంగా విడుదల చేసిన పుష్ప టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఊరమాస్‌ లుక్కులో క‌నిపించి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చాడు. బన్నీ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. అందుకు తగ్గట్లే ఐదు భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుద‌ల చేశారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బ‌న్నీ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నాడు బన్నీ. తాజాగా బన్నీ మరో డైరెక్టర్ స్టోరీకి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇప్పటివరకు కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ, లవ్ మూవీస్ చేసిన బన్నీ త్వరలో రాజకీయ నేపధ్యంతో తెరకెక్కనున్న సినిమాలో కన్పించనున్నాడట. వైఎస్ఆర్ బయోపిక్‌ యాత్ర మూవీ తెరకెక్కించిన మహి వి రాఘవ దర్శకత్వంలో బన్నీ కొత్త సినిమా రానున్నట్టు తెలుస్తోంది. మహి ఓ రాజకీయ నేపధ్యపు కథను విన్పించగా నచ్చిందని చెప్పి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేయిమని చెప్పాడట. కేవలం రాజకీయ నేపథ్యంతో పాటు వాస్తవ సంఘటనలు కూడా ఇందులో ఉంటాయని ఇండస్ట్రీ టాక్. అయితే బన్నీ-మహీ కాంబినేషన్ ప్రాజెక్టును నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందట. ఇదిలా ఉండగా పుష్ప షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా పై క్లారిటీ రానుందట. బన్నీ పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంతవరకు చేయలేదని ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు.