Begin typing your search above and press return to search.

RRR హీరోల నేష‌న‌ల్ ట్రైల్స్ ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో..!

By:  Tupaki Desk   |   12 Jun 2021 12:30 PM GMT
RRR హీరోల నేష‌న‌ల్ ట్రైల్స్ ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంతో మార్కెట్ విస్తరించుకోవాలని ఇద్దరు స్టార్ హీరోలు ప్లాన్ చేసుకున్నారు. త్రిపుల్ ఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితే.. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ మాదిరిగా, చరణ్ - తారక్ ల క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కి చేరనుంది. ఇదే కనుక జరిగితే ఇద్దరు హీరోలూ పాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేలా సినిమాలు చేయాల్సి ఉంటుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ సినిమా అందించిన కొరటాల శివ దర్శకత్వంలో '#NTR30' సినిమా చేయనున్నారు. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్టుగానే షో మ్యాన్ శంకర్ తో భారీ సినిమాగా '#RC15' ప్రకటించారు.

అయితే తారక్ - చరణ్ ఇద్దరూ జ‌క్క‌న్న తోడు లేకుండా చేస్తున్న నేష‌న‌ల్ ట్రైల్స్ ఎంత‌వ‌ర‌కు ఫ‌లిస్తాయో అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హిందీ మార్కెట్ వరకు ఓకే అనిపించినా మిగతా భాషల్లో నిరాశపరిచింది. ఇప్పుడు చెర్రీ - ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. చరణ్ ఆల్రెడీ 'తుఫాన్'(జంజీర్) సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో ఏ మేరకు రాణిస్తారో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.