Begin typing your search above and press return to search.

ఇలాగైతే థియేటర్ల కు జనాలు ఎందుకు వస్తారు?

By:  Tupaki Desk   |   10 Dec 2019 6:48 AM GMT
ఇలాగైతే థియేటర్ల కు జనాలు ఎందుకు వస్తారు?
X
ఒకప్పుడు సినిమా చూడాలంటే ఖచ్చితంగా సినిమా థియేటర్‌ ఒక్కటే మార్గం. కాని ఇప్పుడు అనేక దారులు ఉన్నాయి. సినిమా విడుదల అయిన వెంటనే పైరసీ వచ్చేస్తుంది. పైరసీలో ఏం చూస్తాంలే అనుకుంటే టీవీల్లోనే లేదంటే ఏదైనా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌పైనో వచ్చేస్తుంది. కేవలం నెల గ్యాప్‌లోనే అమెజాన్‌.. నెట్‌ ప్లిక్స్‌... హాట్‌ స్టార్‌ వంటి ఆన్‌ లైన్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌ లో వస్తే సినిమా థియేటర్‌ కు వెళ్లి ప్రేక్షకులు చూడాల్సిన అవసరం ఏంటీ అనుకుంటున్నారు.

నెల రోజులు కూడా కాకుండానే సినిమాలు ఆన్‌ లైన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వడం కామన్‌ అయ్యింది. ఇటీవలే వచ్చిన సందీప్‌ కిషన్‌ 'తెనాలి రామకృష్ణ' మూవీ అప్పుడే ఆన్‌ లైన్‌ లోకి రాబోతుంది. ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో కూడిన సినిమా అంటూ కామెంట్స్‌ వచ్చాయి. అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను ఆన్‌ లైన్‌ లో స్ట్రీమింగ్‌ చేయవచ్చులే అనుకుని థియేటర్ల కు వెళ్లలేదు.

ఇక విజయ్‌ దేవరకొండ నిర్మాణం లో వచ్చిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా ఆన్‌ లైన్‌ లో విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాకు కూడా పర్వాలేదు అన్నట్లుగా టాక్‌ వచ్చింది. అయినా కూడా థియేటర్లలో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఈ రెండు సినిమాలు థియేటర్లలో సాదా సీదా వసూళ్లు రాబట్టింది. కాని మరి కొన్ని రోజుల్లో హాట్‌ స్టార్‌ లో రాబుతున్నా అప్పుడు భారీగా వ్యూస్‌ ను దక్కించుకునే అవకాశం ఉంది. థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడని వారికి ఓటీటీ ఒక వరం మాదిరిగా దొరికింది. ఓటీటీ ద్వారా నెల రోజుల్లోనే సినిమాలు వస్తే థియేటర్ల కు జనాలు ముందు ముందు మరింతగా తగ్గే అవకాశం ఉంది.