Begin typing your search above and press return to search.

వివాదంలో 'ఆదిపురుష్'.. మేకర్స్ కు హోమ్ మినిస్టర్ వార్నింగ్..!

By:  Tupaki Desk   |   4 Oct 2022 11:52 AM GMT
వివాదంలో ఆదిపురుష్.. మేకర్స్ కు హోమ్ మినిస్టర్ వార్నింగ్..!
X
'ఆదిపురుష్' సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కారణంగానే ఈ చిత్రం హాట్ టాపిక్ అవుతోంది. వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయని.. ప్రతిష్టాత్మక సినిమాని అని చెప్పి నాసిరకం కార్టూన్ సినిమా అందిస్తున్నారంటూ మేకర్స్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ టీజర్ తో హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయంటూ ఇప్పుడు వివాదం చెలరేగింది. ఇందులో రాజకీయ నాయకులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదురుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. రామాయణం ఇతిహాసం ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా ''ఆది పురుష్'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని టీ-సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తే.. సీతగా కృతి సనన్ - రావణుడిగా సైఫ్ అలీఖాన్ - లక్ష్మణుడిగా సన్నీ సింగ్ - హనుమంతుడిగా దేవ్ దత్తా గజానన్ కనిపించనున్నారు.

అయితే ''ఆది పురుష్'' సినిమా టీజర్ విడుదలైన నేపథ్యంలో రాముడు - రావణుడు - హనుమాన్ పాత్రలను చిత్రీకరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పరమశివ భక్తుడైన లంకేశ్ పాత్రను అల్లావుద్దీన్ ఖిల్జీ - ఔరంగజేబు గెటప్స్ ను పోలివుండేలా చూపించారని విమర్శిస్తున్నారు. మిలిటరీ కటింగ్ - స్పైక్స్ తో సైఫ్ అసలు రావణాసురుడిగా కనిపించలేదని అంటున్నారు. ఈ క్రమంలో #BoycottAdipurush అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఆదిపురుష్ సినిమాపై అభ్యంతరాలు ఉన్నాయి. హనుమంతుడికి లెదర్ జాకెట్ తొడిగారు. హిందువుల నమ్మకాలు - మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తప్పుడు పద్ధతిలో తీయడం సరికాదు. ఇందులో ఉన్న అభ్యంతరకర సీన్లను తీసేయాలని నేను ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ కు లేఖ రాస్తున్నాను. ఒకవేళ వాటిని తీయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం'' అని నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

ఇప్పటికే బీజేపీ నాయకురాలు మాళవిక అవినాశ్ కూడా 'ఆదిపురుష్' డైరెక్టర్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాల్మీకి రాసిన రామాయణం - తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర గురించి దర్శకుడు​ ఓం రౌత్ అధ్యయనం చేయలేదనిపిస్తోందని అన్నారు. టీజర్​ లో రావణుడి పాత్ర నీలి కళ్లతో.. లెదర్​ జాకెట్​ వేసుకున్నట్లు చూపించారని మండిపడ్డారు.

స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదని.. మన దేశ ప్రజల నాగరికతను కాపాడే రామాయణం ఆధారంగా సినిమా తీస్తూ.. రావణుడి పాత్రను వక్రీకరించినందుకు చాలా బాధగా ఉందని మాళవిక అవినాష్ ఫైర్ అయ్యారు. ఒక శివ భక్త బ్రాహ్మణుడైన రావణుడు 64 కళలలో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు. అయితే ఆదిపురుష్​ లోని రావణుడు మాత్రం టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు. మన రామాయణం లేదా చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి అని మాళవిక అన్నారు.

ఇప్పటివరకూ 'ఆదిపురుష్' సినిమా వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్ నడుస్తుండగా.. ఇప్పుడు హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారంటూ రాజకీయ నాయకులు విమర్శించడంతో వివాదం తలెత్తింది. మరి రానున్న రోజుల్లో ఇది ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.