Begin typing your search above and press return to search.

రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:30 PM GMT
రాంగోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు
X
వివాదాస్పద టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

‘దిశ-ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని దిశ ఎన్ కౌంటర్ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమ కుమారులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, ఇప్పుడు మళ్లీ సినిమాలో వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతారని నిందితుల కుటుంబ సభ్యుల తరుపున న్యాయవాది క్రుష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించి వారిని ఊరిలో ఉండనివ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే జ్యూడిషియల్ కమిషన్ విచారణ సాగుతున్న కేసుపై సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరాడు. దీంతో కోర్టు రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపుతూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈనెల 26న దిశ సినిమా విడుదలకు రాంగోపాల్ వర్మ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో హైకోర్టు ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం. నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

కాగా ఈ సినిమాను ఆపాలంటూ గతంలో ‘దిశ’ తండ్రి శ్రీధర్ రెడ్డి కూడా హైకోర్టులో పిటీషన్ వేశారు. గత ఏడాది నవంబర్27న షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లిలో దిశ హత్యాచారం జరగింది. పోలీసులు నిందితులను డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ చేశారు.