Begin typing your search above and press return to search.

'వందేళ్లు బతుకుతా అన్నాడు.. 71 ఏళ్లకే చనిపోయాడు'

By:  Tupaki Desk   |   9 May 2021 2:30 AM GMT
వందేళ్లు బతుకుతా అన్నాడు.. 71 ఏళ్లకే చనిపోయాడు
X
అలనాటి హీరో శోభన్ బాబు తనదైన అభినయం - డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆనాటి అమ్మాయిల కలలు రాకుమారుడైన శోభన్ బాబు.. 'సోగ్గాడు' గా మిగిలిపోయారు. చివరి వరకూ లీడ్ రోల్స్ లోనే నటిస్తూ ప్రేక్షకులకు సోగ్గాడిగానే గుర్తుండి పోయాడు. ఆయనతో అనేక సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

''శోభన్‌ బాబు చాలా మంచి వ్యక్తి. కష్టపడి పైకి వచ్చాడు. వివాదాలకు దూరంగా ఉండేవాడు. అయితే ఆయన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడనీ అంటారు. అందులో తప్పేమీ లేదు. ఇంత చెల్లిస్తానని ముందే ఒప్పుకున్న తర్వాత ఎలాగైనా నిర్మాత చెల్లించాల్సిందే. అలాగే ఆయన ఎవరికీ దానాలు చేసేవాడు కాదు కదా అని కూడా అంటారు. శోభన్‌ బాబు ఎంతోమందికి గుప్తదానాలు చేసేవాడు. కానీ ప్రచారం చేసుకునేవాడు. అతని వల్ల లాభపడినవాళ్లను అడిగితే ఆ విషయం తెలుస్తుంది'' అని కోదండ రామిరెడ్డి తెలిపారు.

'తన స్థాయికి తగినవాళ్లే కోడలుగా, అల్లుళ్లుగా రావాలని అనుకోకపోవడం ఆయన గొప్పతనం. ఆస్తి పాస్తులు లేకపోయినా బాగా చదువుకున్న వాళ్లను తెచ్చి కూతుళ్లకు పెళ్ళి చేశాడు. ఓ హెడ్‌ మాస్టర్ కూతుర్ని తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాడు. ఒక్క రూపాయి కట్నం తీసుకోకపోవడమే కాదు, అన్ని ఖర్చులూ తనే భరించి కొడుకు పెళ్ళిచేశాడు' అని దర్శకుడు చెప్పారు. శోభన్ బాబుకు ఎలాంటి దురలవాట్లు లేవని.. మందు సిగరెట్ లాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉండేవాడని.. అలాంటి వ్యక్తి సడన్ గా చనిపోయాడంటే మొదట నేను నమ్మలేకపోయా అని అన్నారు.

''ఓ సందర్భంలో 'నీ అల్లుడు అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌ కదా, ఒకసారి వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చు కదా' అని సలహా ఇచ్చాను. దానికి ఆయన 'నాకు టెస్టులు ఎందుకురా.. మా తాత 107 ఏళ్లు బతికాడు. మా నాన్న వందేళ్లు బతికాడు. నేనూ వందేళ్లు బతుకుతాను. నీకో విషయం చెప్పాలి. నాకు ఇంజెక్షన్ అంటే భయంరా. అందుకే హాస్పిటల్ కి వెళ్లను' అని చెప్పాడు. నాకు తెలిసి శోభన్‌ బాబుకు ఎలాంటి సమస్యలూ లేవు. బాధలూ, చికాకులు లేవు. చాలా ప్రశాంతమైన జీవితం ఆయనది. అటువంటి వ్యక్తి 71వ ఏట చనిపోయాడనే వార్త టీవీల్లో చూసి నమ్మలేకపోయాను. వెంటనే మద్రాసుకు వెళ్లి చివరి చూపు చూసుకోగలిగాను'' అని కోదండ రామిరెడ్డి చెప్పుకొచ్చారు.