Begin typing your search above and press return to search.

'వీరమల్లు' షూటింగ్ అప్డేట్.. చాలా గ్యాప్ తర్వాత ఔట్ డోర్ కు పవన్..!

By:  Tupaki Desk   |   27 Nov 2021 7:30 AM GMT
వీరమల్లు షూటింగ్ అప్డేట్.. చాలా గ్యాప్ తర్వాత ఔట్ డోర్ కు పవన్..!
X
పవన్ క‌ల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్ ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు''. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ పీరియాడికల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ పాటికే పూర్తవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ ప్రభావ పరిస్థితులు మరియు ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని పునఃప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్న పవన్.. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'' చిత్రాన్ని తిరిగి సెట్స్ మీదకు తీసుకురావాలని చూస్తున్నారు.

ఈ గ్యాప్ లో దొరికిన సమయాన్ని దర్శకుడు క్రిష్ లొకేషన్స్ వెతకడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఢిల్లీ మరియు రాజస్థాన్‌ లలో పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

రాజస్థాన్ ఎడారుల్లో ఈ పీరియాడికల్ డ్రామా కోసం సెట్స్ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. ఆనంద్ సాయితో దర్శకనిర్మాతలు చర్చిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు - కుతుబ్ షాహీల నేపథ్యంలో అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సెట్స్ - వీఎఫ్ఎక్స్ వర్క్స్ కీలకం కానున్నాయి. యాదాద్రి వంటి ఆలయ వాస్తుశిల్పి వెనకున్న ఆనంద్.. ఇప్పుడు 'వీరమల్లు' కోసం విలాసవంతమైన సెట్స్ నిర్మాణం చేపట్టనున్నారని తెలుస్తోంది.

'హరి హర వీరమల్లు' రాబోయే షెడ్యూల్ పవన్ కళ్యాణ్ పాల్గొనే కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలతో ప్రారంభమవుతుందని సమాచారం. పవన్ చాలా గ్యాప్ తర్వాత చేయనున్న ఔట్ డోర్ షూటింగ్ ఇదే అవుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ - అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా.. ఫస్ట్ హిస్టారికల్ మూవీ. ఎం.ఎం. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. హాలీవుడ్ కు చెందిన వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ చూసుకుంటున్నారు.

"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" చిత్రాన్ని 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తారు.