Begin typing your search above and press return to search.

'గూఢ‌చారి' కి మూడేళ్లు.. సీక్వెల్ '#G2' అప్డేట్ ఇచ్చిన అడవి శేష్..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 8:31 AM GMT
గూఢ‌చారి కి మూడేళ్లు.. సీక్వెల్ #G2 అప్డేట్ ఇచ్చిన అడవి శేష్..!
X
టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ 'క్ష‌ణం' 'అమీ తుమీ' 'గూఢ‌చారి' 'ఎవరు' వంటి వినూత్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పై థ్రిల్లర్ కథాంశంతో 2018లో విడుదలైన 'గూఢ‌చారి' చిత్రం శేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్ తో చిన్న సినిమాగా వచ్చి, ఘన.విజయం సాధించింది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అబ్బూరి రవి మాటల రాశారు. ఇందులో శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటించగా.. జగపతి బాబు - ప్రకాష్ రాజ్ - సుప్రియ - వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

అభిషేక్ పిక్చర్స్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - విస్తా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు కలిసి నిర్మించిన 'గూఢ‌చారి' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. అభిషేక్ నామా - టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈరోజుకి (ఆగస్ట్ 3) మూడేళ్లు అయింది. ఈ నేపథ్యంలో హీరో - దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా 'గూఢచారి 2' చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు.

''గూఢచారి తెర మీదకు వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది. ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. అతను త్వరలో పెద్ద మిషన్‌ తో తిరిగి రాబోతున్నాడు. ఈ నెలలోనే 'గూఢచారి 2' ప్రకటన వస్తుంది'' అని అడవి శేష్ ట్వీట్ చేశారు. ''త్రినేత్ర వాచ్ కి 3 సంవత్సరాలు. మా బ్లాక్‌ బస్టర్ మిషన్ #గూడాచారి 3 య్ఏళ్ళు పూర్తి చేసుకుంది. #గూఢచారి 2 కొత్త మిషన్‌ తో లోడ్ అవుతోంది'' అని నిర్మాతలు పేర్కొన్నారు. నిజానికి అడవి శేష్ అప్పట్లోనే 'గూఢచారి' సినిమాకి సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. 'గూఢచారి 2' చిత్రానికి కూడా శేష్ స్క్రిప్ట్ అందిస్తుండగా.. పార్ట్-1 కు వర్క్ చేసిన మిగతా సాంకేతిక నిపుణులు అందరూ ఇందులో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా అడవి శేష్ ప్రస్తుతం ''మేజర్'' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ముంబై 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దీనికి కూడా శేష్ స్క్రిప్ట్ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. 'గూఢచారి' ఫేమ్ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

'మేజర్' చిత్రంలో శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి దీనికి డైలాగ్స్ రాస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరోవైపు 'హిట్ 2: ది సెకండ్‌ కేస్‌' చిత్రంలో కూడా అడవి శేష్ హీరోగా నటిస్తున్నారు. ఇది సూపర్ హిట్ 'హిట్' కు సీక్వెల్. ఇందులో హిట్‌ (హొమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో శేష్ నటించనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి - కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటించనున్నారు. జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సమకూరుస్తుండగా.. మణికందన్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.