Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో హైదరాబాద్ వాసికి సంబంధం ఏంటి...?

By:  Tupaki Desk   |   8 Aug 2020 9:30 AM GMT
సుశాంత్ కేసులో హైదరాబాద్ వాసికి సంబంధం ఏంటి...?
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య కేసులో హైదరాబాద్‌ వాసికి ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద రియాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రియా చక్రవర్తి ముంబై లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు సాగిన ఈ ఎంక్వైరీలో రియా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ పలు విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఈడీ అధికారులు రియాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది. సుశాంత్ సింగ్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు అందరూ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ మరియు ఆమె కుటుంబ సభ్యుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సిద్ధార్థ్ పిథాని ఎవరనే దానిపై ద్రుష్టి సారించారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. సుశాంత్‌ కు సంబంధించిన విదేశీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అతని అకౌంట్ నుండి సిద్ధార్థ్ ఖాతాకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్టుగా గుర్తించారట. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ కు అంత మొత్తంలో సుశాంత్‌ ఎందుకు ట్రాన్సఫర్ చేశాడని.. దాని వెనుక గల కారణాలపై ఈడీ విచారిస్తున్నట్టు సమాచారం.