Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్ వేరు కుంప‌ట్లు

By:  Tupaki Desk   |   19 Feb 2020 12:30 PM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్ వేరు కుంప‌ట్లు
X
త‌ల్లి వేరు నుంచి పిల్ల వేరు .. వేరుప‌డ‌క‌పోతే దాని ఎదుగుద‌ల కుదురుతుందా? వేరు కాపురం పెట్ట‌ని కొడుకు ఎక్క‌డైనా ఉంటాడా? ఇంత‌కుముందులా ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థకు ఆస్కారం ఎక్క‌డుంది? ఇక వ్యాపార భాగ‌స్వాముల్లోనూ నిరంత‌రం క‌లిసి ఉండ‌డం అన్న‌ది క‌ల్ల‌. వ్యాపార‌ల్లో ఏదో ఒక‌ లొల్లు కూడా ఉంటుంది. అయితే అలాంటి కార‌ణాలు ఉన్నా లేక‌పోయినా కానీ.. టాలీవుడ్ లో అగ్ర బ్యాన‌ర్ల‌లోంచి భాగ‌స్వాములు విడిపోయి వేరు కుంప‌ట్లు పెట్టుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇంత‌కుముందు మైత్రి మూవీ మేక‌ర్స్ నుంచి సి.వి.మోహ‌న్ వేరు ప‌డ్డారు. ర‌వి- నవీన్ క‌లిసి ఆ బ్యాన‌ర్ ని న‌డిపిస్తుంటే వీళ్ల‌కు అల్లు అర్జున్ బంధువు అయిన ముత్తంశెట్టి క‌లిసారు. అయితే ఆయ‌న ఇటీవ‌లే కాలం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మైత్రి లానే మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ నుంచి భాగ‌స్వామి వేరుప‌డ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ అంటే దిల్ రాజు- శిరీష్ -ల‌క్ష్మ‌ణ్ అంటూ మూడు పేర్లు వినిపిస్తాయి. ఇందులోంచి ల‌క్ష్మ‌ణ్ వేరు కుంప‌టి పెట్టుకుంటున్నార‌ట‌. ఐదారు నెల‌లుగా ల‌క్ష్మ‌ణ్ సొంత బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీయాల‌న్న ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తున్నార‌ట‌. కుమారుడు ఇప్ప‌టికే లైన్ ప్రొడ్యూస‌ర్ గా అనుభ‌వం ఘ‌డిస్తున్నారు. కాబ‌ట్టి త‌న‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తార‌న్న‌మాట‌. ఇక‌పై శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ లో దిల్ రాజు - శిరీష్ క‌లిసి సినిమాలు నిర్మిస్తారు. ఇక ఆ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే బ్ర‌ద‌ర్స్ అయినంత మాత్రాన .. వేరుకుంప‌టి పెట్టుకోరు అన్న గ్యారెంటీ అయితే లేదు. ఎవ‌రికి వారు సొంతంగా ప్రణాళిక‌లతో ఎద‌గాల్సి ఉంటుంది ఎక్క‌డైనా. ఆ క్ర‌మంలోనే శిరీష్ కూడా సొంత బ్యానర్ పెట్టుకునే అవ‌కాశం లేక‌పోలేదు.

వేరు కుంప‌టి అనగానే మ‌రో సంగ‌తిని గుర్తు చేసుకోవాలి. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ ఆస్తుల్ని పంచేశాక కుమారులు అల్లుఅర్జున్ .. శిరీష్ సైతం ఎవ‌రికి వారు విడివిడిగా ఎదిగేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. శిరీష్ సొంత ఓటీటీ వేదిక‌కు సీఈవోగా కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు బ‌న్ని ఏఏ బ్రాండ్ బ్యాన‌ర్ ని స్థాపించి సొంతంగా సినిమాల్ని నిర్మించ‌నున్నారు. ఈ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ అంబానీ బ్ర‌ద‌ర్స్ లా గ‌ట్టి ప్ర‌ణాళిక‌ల్లోనే ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

ఇంకాస్త అడ్వాన్స్ డ్ గా వెళ్లి వేరుకుంప‌ట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఇప్ప‌టికే తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లిలో వేరు కుంప‌టి ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ (ఎల్.ఎల్.పి) అంటూ కొంద‌రు అగ్ర నిర్మాత‌లు అస‌లు నిర్మాత‌ల మండ‌లి నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వీళ్లు ప‌రిశ్ర‌మ‌ను శాసిస్తున్నారు. అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘంలోనూ వ‌ర్గ‌పోరు వేరు కుంప‌ట్ల గురించి వివాదాల‌పైనా విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది.